Celebrities Angry : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం వరకూ 36.68 శాతం పోలింగ్ నమోదవ్వగా.. అత్యధికంగా గద్వాలలో 49.29 శాతం పోలింగ్ నమోదైతే.. అత్యల్పంగా హైదరాబాద్ లో 20.79 శాతం మాత్రమే నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా గ్రాడ్యుయేట్లు ఉండేది హైదరాబాద్ లోనే. అలాంటి సిటీలో ఇంత తక్కువగా ఓటింగ్ శాతం నమోదవ్వడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. గ్రాడ్యుయేట్లు ఓటువేసి.. ఇతరులకు ఓటు గురించి అవగాహన కల్పించాల్సిందిపోయి.. ఇళ్లకే పరిమితమయ్యారని వార్తలొస్తున్నాయి.
ఈ క్రమంలో ఓటేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు హైదరాబాద్ ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లుఅర్జున్, చిరంజీవి, నాని, విశ్వక్సేన్, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, గోపీచంద్, రవితేజ, దర్శకులు, నిర్మాతలు, సీనియర్ నటీనటులు, సింగర్లు సైతం ఉదయం నుంచే క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో.. కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఓటువేయకుండా ఇళ్లకే పరిమితమైన హైదరాబాద్ ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ పోలింగ్ సందర్భంగా అన్ని కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారంటే.. ఓటు వేయడానికే తప్ప.. సెలవుదినంగా వాడుకునేందుకు కాదని నటుడు శివాజీరాజా పేర్కొన్నారు. రెండుసార్లు వరుసగా ఓటువేయని వ్యక్తుల పాస్ పోర్ట్ నుంచి ప్రతి ప్రభుత్వ గుర్తింపు కార్డును రద్దు చేయాలన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా వృద్ధులు, వికలాంగులు సైతం ఓటేసేందుకు వస్తున్నారని.. వారిని ఆదర్శంగా తీసుకుని యువత కదలాలని పిలుపునిచ్చారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
తమ ఓటుహక్కు వినియోగించుకున్న నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు శేఖర్ కమ్ముల సైతం ఓటర్ల నిర్లక్ష్యంపై ఆవేదన చెందారు. ఓటు వేయకుండా ప్రభుత్వాలను విమర్శించే హక్కు మీకు లేదని, సెలవు అనుకుని పడుకున్న ప్రతిఒక్కరూ నిద్రలేచి వచ్చి ఓటేయాలని, ఓటు వేయడం మన బాధ్యత అని గుర్తుచేశారు. సినీ నటి మంచు లక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిల్మ్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం సిగ్గుచేటని మంచు లక్ష్మి అన్నారు. మార్పు కావాలంటే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.