Big Boss 7 Telugu : ఈ రచ్చేంది బిగ్బాస్.. హౌస్ నుంచి బయటకు రాగానే ఈ రచ్చేంటంట..! ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర హంగామా చూస్తే ఎవరైనా ఈ మాటే అంటారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రచ్చ రచ్చ చేశారు పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు.
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. రన్నరప్ గా సీరియల్ నటుడు అమర్ దీప్ నిలిచాడు. ఈ సందర్భంగా బిగ్బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్కు పెద్ద ఎత్తున ప్రశాంత్, అమర్ అభిమానులు వచ్చారు. ప్రశాంత్ విజేత అని తెలియగానే అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ, తోసుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు.
బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్ దీప్ వాహనాన్ని ముందుకు కదలనీయకుండా చుట్టుముట్టారు. కారులో ఉన్న అమర్ దీప్ని, అతని భార్యని బూతులు తిట్టారు. అమర్ దీప్ కారు అద్దాన్ని పగలగొట్టి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒకడైతే ఏకంగా కారు పైకి ఎక్కేశాడు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. అటుగా వెళ్తున్న కొండాపూర్- సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సుపై దాడి చేసి, అద్దాలను పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కి చేరుకుని లాఠీచార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు.
హౌస్లో ఉన్న సమయంలో అమర్దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే ఈ ఉద్రిక్తతలకు కారణంగా చెప్తున్నారు. టైటిల్ విన్నర్గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ రాత్రి 10 గంటల వరకూ కనిపిస్తే.. ఆ తర్వాత అర్థరాత్రి వరకూ ఫ్యాన్స్ కొట్లాట ఉద్రిక్తతలకు దారి తీసింది. గొడవకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇరువురి అభిమానుల చర్యలపై పలవురు సిటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎమోషన్స్ రెచ్చగొట్టే బిగ్ బాస్ షోనే రద్దు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
.
.