Ayodhya Ram Mandir: మరికొన్ని గంటల్లో 500 ఏళ్ల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా తయారైంది. ఆలయాలు, ప్రధాన మార్గాలను దగదగ మెరిసే విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో అయోధ్య నగరం మారుమోగిపోతోంది. ఈ మహోత్సవంలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి రాజకీయ, సినీ ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు రామ్ చరణ్ అయోధ్యకు చేరుకున్నారు. మెగా ఫ్యామిలీకి ఇప్పటికే ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు వారికి ఆహ్వానపత్రికలు స్వయంగా అందజేశారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం అయోధ్యకు చేరుకుంది.
ఈ సందర్భంగా చిరంజీవి ఎయిర్పోర్ట్లో విలేకరులతో మాట్లాడారు. తాను ఆంజనేయుడి భక్తుడినని.. ఆయనే స్వయంగా తనను రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠలో భాగస్వామిని కాబోతోండటం.. జీవితకాలం అవకాశమని పేర్కొన్నారు.