Ashneer Grover: బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు మరికొద్ది గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్లోని జైసల్మీర్లో వీరి వివాహం ఘనంగా జరగనుంది. ఈ సమయంలో కియారా వల్ల తన భార్య విడాకులిచ్చే పరిస్థితి వచ్చిందంటూ భారత్పే సహవ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
‘‘ఒకసారి నేను, నా భార్య మాధురి, నా స్నేహితుడు కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో పెళ్లెప్పుడని మా స్నేహితుడిని ఆరా తీశాము. ఓ సినీతారతో పెళ్లి సంబంధం కుదిరే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాడు. వెంటనే నేను మా అమ్మతో.. ఇప్పటికిప్పుడు నేను పెళ్లికి రెడీ అయితే కియారా అద్వానీని పెళ్లి చేసుకోవచ్చు తెలుసా? అని అన్నాను.
దీంతో నా భార్య మాధురికి కోపం వచ్చింది. నాతో గొడవ పడింది. ఆ తర్వాత మేము ముంబై వెళ్లేందుకు విమానం ఎక్కాము. అప్పటికి ఆమె కోపం ఇంకా తగ్గలేదు. నవ్వు కియారాను పెళ్లి చేసుకుంటావా.. అయితే నేనెందుకు అంటూ ఫ్లైట్లో గట్టిగా అరిచింది. ఫ్లైట్లో ఉన్నవారంతా మా గొడవ చూసి ఎంటర్టైన్మెంట్లా ఎంజాయ్ చేశారు’’ అంటా సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో తెగ వైరలవుతోంది.