AR Rahman: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగాన్ని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి సృష్టిస్తున్న డీప్ ఫేక్ నకిలీ ఫొటోలు, వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేశాయి. అయితే ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆస్కార్ గ్రహీత స్టార్ సింగర్ ఓ అద్భుతం క్రియేట్ చేయనున్నారు. ఆ సింగర్ మరెవరో కాదు ఏ.ఆర్. రెహమాన్.
తన సంగీతంతో ఎంతో మంది సినీ ప్రియులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ నటిస్తోన్న ‘లాల్ సలాం’ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అందులో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి ఇద్దరు దివంగత గాయకుల స్వరాన్ని వినిపించనున్నారు.
దివంగత గాయకులు అయిన బాంబా బక్యా, షాహుల్ హమీద్ల వాయిస్లను రీ-క్రియేట్ చేసి ఈ మూవీలో ‘తిమిరి ఎలుదా’ అనే సాంగ్ను రూపొందించనున్నారు. ఇదే విషయాన్ని రెహమాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయోగం ఇదే మొదటి సారి అని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.