Tollywood : టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత ఆరు నెలల్లో ఎంతో మంది ప్రముఖులు తుదిశ్వాస విడిచారు. తాజాగా ప్రముఖ ఎడిటర్, నిర్మాత జి. జి . కృష్ణారావు బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ఆయన టాలీవుడ్ అలనాటి టాప్ డైరెక్టర్స్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. దాదాపు 200 సినిమాలకు ఎడిటింగ్ చేశారు. ముఖ్యంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ చిత్రాలకు ఎక్కువగా పనిచేశారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ సినిమాలుగా ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఎన్టీఆర్, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన టాప్ హిట్స్ ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్ పాపారాయుడు’ చిత్రాలకు ఎడిటర్గా కృష్ణారావు పనిచేశారు. లెజండరీ డైరెక్టర్స్ బాపు, జంధ్యాల సినిమాలను ఎడిటింగ్ చేశారు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలకు ఆయన ఆస్థాన ఎడిటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నిర్మాణ సంస్థలు నిర్మించిన దాదాపు అన్ని సినిమాలకు ఆయనే ఎడిటర్ గా పనిచేశారు. కమర్షియల్ సినిమాలతోపాటు కళాత్మక చిత్రాలకు కూడా ఎడిటింగ్ చేసి ప్రశంసలు అందుకున్నారు.
కృష్ణారావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.