Sandeep Reddy Vanga – Shah Rukh Khan: బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘యానిమల్’. భారీ బడ్జెట్తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దర్శకుడు సందీప్ ఈ చిత్రాన్ని ఫుల్ మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాలతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తండ్రీకొడుకుల సెంటిమెంట్తో రూపొందిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించి మెప్పించింది. బాక్సాఫీసు వద్ద రూ.900 కోట్లు వసూళు చేసిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక అతి తక్కువ సినిమాలు తెరకెక్కించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఈ మూవీ మరింత పాపులారిటీని తెచ్చి పెట్టింది. దీంతో సందీప్కు వరుస పెట్టి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ మూవీ అనంతరం సందీప్ లైనప్లో చాలా సినిమాలే ఉన్నాయి. అయినా.. అతడు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అంటూ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్తో కలిసి పని చేయాలని తనకి ఎప్పటి నుంచో ఉందని అన్నారు. కొంతకాలం క్రితం అనుకోని విధంగా షారుఖ్ని కలిసానని.. అప్పుడే ఆయనకు యానిమల్ మూవీ టీజర్ చూపించానని తెలిపాడు.
ఆ టీజర్ తనకెంతో నచ్చిందని షారుఖ్ చెప్పడం సంతోషంగా అనిపించిందని అన్నాడు. ఆయనొక గొప్ప నటుడని.. భవిష్యత్తులో ఆయనతో కలిసి తప్పకుండా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఆయనతో పాటు రణ్వీర్ సింగ్తోనూ సినిమా చేయాలని ఉందని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో సందీప్ రెడ్డి వ్యాఖ్యలకు షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. త్వరలో తమ హీరో నుంచి మరో మాస్ యాక్షన్ సినిమా చూడొచ్చని అనుకుంటున్నారు.