Anasuya Bharadwaj About Jani Master Case: ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ కేసు గురించే చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్పై కేసులో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ కేసులో రోజురోజుకీ నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. చాలామంది బాధితురాలికి మద్దతు ఇవ్వడం కోసం ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు ఈ విషయంపై స్పందించారు. సినీ పరిశ్రమలోని పెద్దలు సైతం బాధితురాలికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్పేసే యాంకర్ అనసూయ సైతం ఈ విషయంపై స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ షేర్ చేసింది.
చాలా బాధేస్తోంది
‘ఇంతకాలంగా ఆ అమ్మాయి అనుభవిస్తుంది తలచుకుంటేనే చాలా బాధేస్తోంది. చాలామంది అమ్మాయిలు, ఆడవారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నా కూడా బయటికి చెప్పకోడం లేదనే విషయం తలచుకుంటేనే చాలా కోపం, బాధ కలుగుతున్నాయి. ఇంక దీన్ని భరించలేము అనుకున్నప్పుడే వారంతా ఎదిరించడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. దీనివల్ల చాలామంది వారికి సపోర్ట్ చేయకుండా వారికే ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్న ఎవ్వరైనా వెంటనే దీని గురించి నోరు తెరిచి మాట్లాడాలని, ఎదిరించాలని నేను కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది అనసూయ భరద్వాజ్.
Also Read: బాధితురాలికి ఆఫర్, నిందితుడికి బెయిల్… బన్నీ డబుల్ ఫేస్డ్ వేషాలు అందుకేనా?
పరిస్థితులు చేయిదాటిపోతాయి
‘మీరు ఎదిరించి మాట్లాడడం వల్ల మీకు మీరు సాయం చేసుకోవడం మాత్రమే కాదు భవిష్యత్తు తరాలకు కూడా సాయం చేసినవారు అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే నేను నిందితుడి పర్యవేక్షణలో పలుమార్లు బాధితురాలిని కలిశాను. తనతో పలు పర్ఫార్మెన్స్లకు పనిచేశాను. ఆ సమయంలో తను ఎదుర్కుంటున్న కష్టాలను చాలా బాగా దాచిపెట్టింది. అంతే కాకుండా ‘పుష్ప’ సెట్స్లో కూడా తనను పలుమార్లు చూశాను. ఎన్ని కష్టాలు వచ్చినా టాలెంట్ అనేది తన దారి తాను వెతుక్కుంటూ వస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు చేయిదాటిపోతాయి. అలాంటప్పుడే మనమందరం ఒకరి కోసం మరొకరం నిలబడుతూ, ఒకరి కోసం మరొకరం మాట్లాడాలి’ అంటూ బాధితురాలిని తాను కలిసిన విషయాన్ని గుర్తుచేసుకుంది అనసూయ.
సపోర్ట్ అందిస్తాను
‘నాతో పాటు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి నా సపోర్ట్ అందిస్తున్నాను. అంతే కాకుండా ఈ కేసులో నిజాయితీగా పనిచేస్తూ బాధితురాలికి న్యాయం చేయాలనుకుంటున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ సమానంగా అవకాశాలు ఇస్తూ పరిశ్రమ అనేది మనకు ఒక సేఫ్ వాతావరణాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అంటూ జానీ మాస్టర్ కేసుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అనసూయ. తనతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఇన్డైరెక్ట్గా ఈ కేసుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మహిళా సంఘాలు అయితే ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. కచ్చితంగా బాధితురాలికి న్యాయం జరగడంతో పాటు జానీ మాస్టర్ లాంటి వ్యక్తిని ఇండస్ట్రీ నుండి దూరం చేయాలని కోరుకుంటున్నాయి.