Taraka Ratna: తారకరత్న మరణం తెలుగువారందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు తారకరాముడు. ఆయన మరణం అభిమానులకే అంతటి విషాదం మిగిలిస్తే.. ఇక తారకరత్న కుటుంబం దు:ఖ సాగరం నుంచి తేరుకోలేకపోతోంది. నందమూరి కుటుంబం ఇంకా షాక్లోనే ఉంది. భార్య అలేఖ్యరెడ్డి ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
గురువారం మార్చి 2, 2023న తారకరత్న పెద్దకర్మ హైదరాబాద్లో నిర్వహించారు. నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తారకరత్న జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు అలేఖ్యరెడ్డి. వాలైంటెన్స్ డే సందర్భంగా గతంలో అలేఖ్యకు తారకరత్న రాసిన ఓ నోట్ను షేర్ చేశారు. “నా జీవితంలో చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. నువ్వే నా ప్రపంచం బంగారు” అంటూ తన ప్రేమనంతా వ్యక్తం చేస్తూ లేఖ రాశారు తారకరత్న. అలేఖ్యకు ముద్దు పెడుతున్న ఫోటోను కూడా పంచుకున్నారు.
ఆ లెటర్ను షేర్ చేస్తూ.. అలేఖ్యరెడ్డి సైతం పలు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. “మన జీవితంలో అన్ని ఒడిదుడుకులు చూశాం. చాలా కష్టాలు పడ్డాం. జీవితంలో అత్యంత కష్టకాలం అనుభవించాం. మన కష్టాలు మీకు మాత్రమే తెలుసు. మంచి రోజుల కోసం ఎదురు చూశాం. మనిద్దరం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. నీ బాధనంతా నీలోనే దాచి.. మాకు అపారమైన ప్రేమను అందించావు. ప్రపంచం ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు మా చుట్టే ఉన్నావు. నేను మరింత ఎత్తుకు ఎదుగుతా నానా. ఈ రోజు నిన్ను మేము చాలా మిస్ అవుతున్నాం నానా” అంటూ ఇన్స్ట్రాలో చాలా ఎమోషనల్ అయ్యారు అలేఖ్యరెడ్డి.