AIFF: కొన్ని ఎన్నికలో, కొంతమంది వ్యక్తులో దేశ ప్రాచీన సంస్కృతిని మార్చలేరని, భారతదేశం ఆత్మ అమరమైనదని.. పద్మభూషణ్ గ్రహీత, గేయ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ అన్నారు. ఛత్రపతి శంభాజీనగర్ లో జరుగుతోన్న 9వ అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండవరోజు పాల్గొన ఆయన.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రముఖ సినీ దర్శకుడు జయప్రద్ దేశాయ్ జావేద్ అక్తర్ ను ఇంటర్వ్యూ చేయగా.. ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
60ల్లో ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు.. నిరాడంబరమైన కుటుంబ నేపథ్యాన్ని కలిగి ఉన్నవారేనని తెలిపారు. ఒక టాక్సీ డ్రైవర్, రిక్షాపుల్లర్, కార్మికుడు, బస్ కండక్టర్, ఉపాధ్యాయుడు.. ఇలా రకరకాల కుటుంబాల నుంచి వచ్చిన వారే హీరోలుగా ఎదిగారని గుర్తు చేశారు. కానీ.. నేటి ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా సంపన్న కుటుంబాలకు చెందినవారేనని జావేద్ అక్తర్ అన్నారు. నేటి సినిమాలు ప్రస్తుత రాజకీయ ఇతివృత్తాలు, సామాజిక సమస్యలను చూపడంపై ఇంట్రస్ట్ చూపవని, వ్యక్తిగత కథలతోనే ఆకట్టుకుంటాయని తన అభిప్రాయాన్ని తెలిపారు.
భాష గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం కమ్యూనికేషన్ సాధనం కాదని, సంస్కృతి అనే నీటితో ప్రవహించే నదిలాంటిదే మన భాష అని తెలిపారు. మనం మన భాషను కోల్పోతే.. మన సంస్కృతిని కోల్పోయినట్లేనని చెప్పారు. దురదృష్టవశాత్తు భాష ప్రాముఖ్యతను అర్థం చేసుకోని వ్యక్తులే దానిపై నిర్ణయాలు తీసుకుంటారన్నారని విమర్శించారు.
ఎల్లోరా గుహలను సందర్శించిన తన అనుభవాలను జావేద్ పంచుకున్నారు. ఎల్లోరా గుహల్లో ఉన్న అద్భుతమైన శిల్పాలను చూసి తాను చలించిపోయానని, ఇంతకుముందు వాటినెందుకు చూడలేదోనని ఆశ్చర్యపోతున్నానని తెలిపారు. మంత్రముగ్ధుల్ని చేసే ఈ కళాఖండాన్ని సృష్టించిన వ్యక్తులు డబ్బుకోసం కాకుండా అభిరుచితో రూపొందించారని తాను ఖచ్చితంగా చెప్పగలనని అన్నారు. ఎల్లోరా శిల్పాలను తీర్చిదిద్దిన వారి అభిరుచి, పట్టుదలలో 1000వ వంతైనా మనం గ్రహించగలిగితే ఈ దేశాన్ని స్వర్గంగా మార్చగలమన్న నమ్మకం తనకు ఉందన్నారు.
ఈ వేడుకలో ప్రముఖ సినీ దర్శకుడు అనుభవ్ సిన్హా, ఏఐఎఫ్ఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ వ్యవస్థాపక చైర్మన్ నందకిషోర్ కగ్లీవాల్, ఎంజీఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విలాస్ సప్కల్, ఫెస్టివల్ డైరెక్టర్ అశోక్ రాణే, ఆర్టిస్టిక్ డైరెక్టర్ చంద్రకాంత్ కులకర్ణి, కన్వీనర్ నీలేష్ రౌత్, కవిదాసు వైద్య, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.