Tollywood: సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశం దక్షిణాది రాష్ట్రాల్లో రచ్చ రేపుతున్నది. జస్టిస్ హేమా కమిటీ రిపోర్టుతో మలయాళం సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశం దుమారం రేపుతున్నది. 2017లో నటి భావనపై జరిగిన కారు దాడి తర్వాత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు తర్వాత నటులు తాము ఎదుర్కొన్న అవాంఛనీయ పరిస్థితులను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఫలితంగా మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, జనరల్ సెక్రెటరీలు రాజీనామాలు చేశారు. ఇంతటి దుమారం రేపిన ఈ అంశం ఇటీవలే ప్రముఖ నటి షకీలా తన అభిప్రాయాలను బాహాటంగా వెల్లడించారు.
మహిళలపై వేధింపులు కేవలం మలయాళం సినీ పరిశ్రమకే పరిమితం కాదని షకీలా తెలిపారు. అది తమిళ సినీ పరిశ్రమలోనూ ఉన్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సినీ పరిశ్రమలను పోల్చుతూ ఆమె మరో కీలక విషయాన్ని వెల్లడించారు. మహిళలు తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపులు ఎదుర్కొనేది తెలుగు సినీ పరిశ్రమలోనే అని బాంబ్ పేల్చింది. ఈ దుమారం అటూ ఇటూ తిరిగి చివరికి తెలుగు సినీ పరిశ్రమకూ చేరేలా ఉన్నది. మరి ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో వేధింపులు ఎదుర్కొన్న బాధితులు బయటకు వచ్చి ఆ కీచకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేలా చేస్తారా? అనేది వేచి చూడాలి.
ఇక షకీలా కామెంట్స్ విషయానికి వస్తే.. ఎలాంటి శషబిషలకు తావు ఇవ్వకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లో జరిగే లైంగిక వేధింపులను బట్టబయలు చేయడానికి బాధితులు ధైర్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సనీ పరిశ్రమల్లో ఉండే చాలా సంఘాలు ఇలాంటి అంశాలను లేవనెత్తి మిన్నకుండిపోతాయని, వాటిపై యాక్షన్ తీసుకోవడంలో విఫలం అవుతాయని షకీలా తెలిపారు.యాక్టర్ దిలీప్, కావ్య మాధవన్ల వివాదాస్పద సంబంధాలను గుర్తుచేస్తూ.. అప్పుడు అందరికంటే ఎక్కువ నష్టపోయిన మంజు వారియర్కు అండగా ఎవరూ నిలబడలేదని చెప్పారు. ఇటీవలే ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి లైంగిక వేధింపుల ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Kadambari Jethwani: ఆ రోజు జరిగింది చెబుతూ.. పోలీసుల ముందు కాదంబరి కన్నీళ్లు, గుండె బరువెక్కడం ఖాయం!
చాలా మంది ఇలాంటి లైంగిక వేధింపుల గురించి బయటకు చెప్పరని షకీలా తెలిపారు. అది వారి కుటుంబపరమైన ఆంక్షలు.. లేదా ఇతర వేరే కారణాలు ఏవైనా ఇలాంటి విషయాలు బయట చెప్పడానికి ముందుకు రారని వివరించారు. కాబట్టి, ఇలాంటి సమస్యలకు మలయాళం, తమిళ సినీ పరిశ్రమల సంఘాలు యాక్షన్ తీసుకోవాలని, అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు కూడా అమలు చేయాలని సూచనలు చేశారు. అయితే, ఇలాంటి విషయాలు బయటకు రావాలంటే ఎవరో ఒకరు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాల్సిందేనని పేర్కొన్నారు.
2000 సంవత్సరంలో కిన్నర తుంబికల్ సినిమా కేరళలో విడుదలైంది. ఈ సినిమాతో షకీలా మలయాళం చిత్రపరిశ్రమలోనూ ఫేమ్ అయ్యారు. ఈ సినిమా కనీసం ఆరు భాషల్లో డబ్ అయింది. 12 లక్షలతో నిర్మించిన ఈ సినిమా రూ. 4 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.