Jamuna: కృష్ణం రాజు, కృష్ణ వంటి ప్రముఖుల మరణాలను మరువక ముందే సీనియర్ నటి జమున మృతి చెందడం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆమె మరణంతో తెలుగు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీప్రముఖులు జమున మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారి మరణానికి సంతాపం తెలియజేస్తూ.. జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
జమున మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటని అన్నారు. నటిగానే కాకుండా ఎంపీగా ప్రజా సేవ చేయడం గొప్ప విషయమన్నారు.
సినీయర్ నటి జమున మృతి చెందడం బాధాకరమని నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారన్నారు. గడుసుతనం కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని వెల్లడించారు.
జమున 195కిపైగా సినిమాల్లో నటించి నవరసనటనా సమార్థ్యం చూపారని నటుడు బాలకృష్ణ అన్నారు. అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా జమున ప్రేక్షకులను అలరించారని వెల్లడించారు. జమున మన మధ్య లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎప్పటికీ మన మదిలో మెదులుతూనే ఉంటాయని చెప్పారు.
నటి జమున మరణ వార్త ఎంతో విచారకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఎన్న విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వెల్లడించారు.
జమున మృతిపట్ల నటుడు జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దాదాపు 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో మహారాణిలా కొనసాగారని వెల్లడించారు.