Actor Siddhiqui : మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తున్న లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న మలయాళ నటుడు సిద్ధిక్ పై చర్యలకు సిద్ధమైన పోలీసులు తాజాగా ఆయనను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి ఈ కేసులో తాజా అప్డేట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
నటుడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ
ప్రముఖ మలయాళ సినీ నటుడు, అమ్మా మాజీ ప్రధాన కార్యదర్శి సిద్ధిక్ పై మహిళా నటిపై అత్యాచారం కేసులో కేరళ ప్రత్యేక పోలీస్ దర్యాప్తు బృందం బుధవారం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. కేరళ హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ కోసం సిద్ధిక్ వేసిన పిటిషన్ను కొట్టివేసినప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. పైగా ఫోన్ ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తాజాగా సిద్ధిక్ దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లుకౌట్ సర్క్యులర్లు జారీ చేశారు. పరారీలో ఉన్న సిద్ధిక్ కోసం ప్రయత్నాలను వేగవంతం చేసిన కేరళ పోలీసులు అతను రాష్ట్రం నుండి పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లుకౌట్ నోటీసును కేరళలోని అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు పంపి, ఇతర రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు కూడా విషయాన్ని చేరవేశారు.
బెయిల్ కోసం సిద్ధిక్ ప్రయత్నాలు
కాగా తన ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సిద్ధిక్ బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సమాచారం ప్రకారం సిద్ధిక్ కోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ కేరళ హైకోర్టు ప్రాథమికంగా చూపిన అంశాల ప్రకారం సిద్ధిక్ కు నేరంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. 2016లో తిరువనంతపురంలోని మస్కట్ హోటల్లో తనపై అత్యాచారం చేశాడని ఓ నటి చేసిన ఫిర్యాదు ఆధారంగా సిద్ధిక్ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
మరో నటుడు అరెస్ట్
అత్యాచారం ఆరోపణల కేసులో నటుడు సిద్ధిక్ పరారీలో ఉండగా, కక్కనాడ్ పాడం, అలువా కుట్టమసేరిలోని ఆయన నివాసాల్లో పోలీసులు సోదాలు చేశారు. మరోవైపు నటిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై నటుడు ఇడవెల బాబును ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. మలయాళ సినీ కళాకారుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, నటుడు ఇడవెల బాబును లైంగిక వేధింపుల కేసులో ఒక నటి ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న అరెస్టు చేసి, విచారణ అనంతరం విడుదల చేసింది. సభ్యత్వం ఇప్పిస్తానని నటిని ఇడవెల బాబు వేధించాడని ఫిర్యాదులో సదరు నటి పేర్కొన్నారు.
కేసులో ఇరుక్కున్న మలయాళ నటులు
పలువురు నటీమణుల ఫిర్యాదుల ఆధారంగా కేరళ పోలీసులు ఇప్పటివరకు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన తొమ్మిది మంది ముఖేష్, జయసూర్య, మణియంపిల్ల రాజు, దర్శకులు రంజిత్, వీకే ప్రకాష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లు విచ్చు, నోబెల్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నటుడు బాబూరాజ్, దర్శకుడు తులసీదాస్ పేర్లు వినిపించినా, వారిపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.