Sayaji Shinde: ప్రముఖ నటుడు షాయాజీ షిండే అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పటివరకు నటుడిగా ఎన్నో మంచి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన.. ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేశాడు. నేడు అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ కండువా కప్పి.. NCP అధ్యక్షుడు మరియు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, NCP జాతీయ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, రాష్ట్ర NCP అధ్యక్షుడు సునీల్ తట్కరే మరియు ఛగన్ భుజబల్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
విలన్ గా తెలుగు ప్రేక్షకులకు షాయాజీ షిండే సుపరిచితుడే. ఈ మధ్యనే సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాయాజీ షిండే బిగ్ బాస్ స్టేజి మీదకు వెళ్లడం.. తన మొక్కల పంపకం ఐడియాను నాగ్ తో పంచుకోవడం జరిగింది. ప్రతి ఆలయంలో ప్రసాదంతో పాటు మొక్కలను కూడా పంచి ఇవ్వాలని, అలాంటి ఒక పథకం పెట్టాలని, దీనికోసం ఏపీ డిప్యూటీ సీఎం ను కలవాలని ఆయన తెలిపిన విషయం తెల్సిందే.
ఇక షాయాజీ అలా చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అయ్యి పవన్ వరకు వెళ్ళింది. మూడు రోజుల క్రితమే షాయాజీ షిండే.. ఏపీ వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిశాడు. తన ఆలోచనను పవన్ కు వివరించాడు. ఇక షాయాజీ ఆలోచన మెచ్చిన పవన్ సైతం.. ఆయనను ప్రశంసించి.. ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.
ఇక ఈ నేపథ్యంలోనే షాయాజీ.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇక నుంచి షాయాజీ నటుడిగా కొనసాగుతూనే.. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననునన్నాడా.. ? లేక పూర్తిగా రాజకీయ సేవకే తన మిగిలిన జీవితాన్ని అంకితం చేయనున్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.