Nani: టాలీవుడ్ లో హీరోల మధ్య పోటీ ఉంటుంది. కానీ, అది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే. అదే టాలీవుడ్ మీద కానీ, టాలీవుడ్ హీరో మీద కానీ బయటివారు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం మిగతా హీరోలు మొత్తం ఏకమైపోతారు. అది టాలీవుడ్ అంటే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎలాంటి విమర్శలు చేయని, ఎలాంటి వివాదాలకు పోనీ డార్లింగ్ ప్రభాస్. ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోడు. కానీ, ప్రభాస్ ను ఎవరు ఏదైనా అన్నా ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగిలిన హీరోలు కూడా ఊరుకోరు. అందుకు నిదర్శనమే ప్రభాస్ జోకర్ వివాదం.
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షి తాజాగా ఒక ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడాడు. ” కల్కి సినిమా నాకు నచ్చలేదు. అమితాబ్ బచ్చన్ అసలు అర్ధం కాడు. ఈ వయస్సులో కూడా ఇలాంటి పాత్రలు ఎలా చేయగలుగుతున్నాడు. ఆయనలో ఉన్న శక్తి నాకు కొంచెం ఉన్నా నా లైఫ్ సెట్ అయ్యిపోయేది. ప్రభాస్ విషయంలోనే నాకు బాధగా ఉంది. అమితాబ్ ముందు నాకు ప్రభాస్ జోకర్ లా కనిపించాడు. అసలు ప్రభాస్ ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టించాయి. ప్రభాస్ ను అనేంత దైర్యం చేస్తాడా అని ఫ్యాన్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు హీరోలు సైతం అర్షద్ వర్షిపై నిప్పులు కక్కుతున్నారు. సుధీర్ బాబు, ఆది సాయి కుమార్, సిద్దు జొన్నలగడ్డ.. లాంటి హీరోలు ప్రభాస్ పై అర్షద్ వర్షి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని సైతం ఈ వివాదంపై స్పందించాడు.
సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ఈ వివాదానికి సంబంధించిన ప్రశ్నను అడుగగా.. అందుకు నాని మాట్లాడుతూ.. ” వదిలేయండి.. నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికీ లైఫ్ లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఇప్పుడే జరిగింది అనుకుంటా.. మీరు ఇంకా అనవసరమైన విషయాన్నీ హైప్ చేస్తున్నారు” అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రభాస్ పేరు తీస్తే తప్ప ఫేమస్ కాలేరని అన్నట్లు చెప్పుకొచ్చాడు. దీనికి దిల్ రాజు కూడా అదే సమాధానం ఇచ్చాడు. పళ్లు ఉన్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు అని ఒక్క లైన్ లో ఇద్దరు ఇచ్చిపడేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.