Akkineni Nagarjuna: నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయిత్రీ గుండెపోటుతో మూడు రోజుల క్రితం మరణించింది. అతి చిన్న వయస్సులోనే ఆమె మరణం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. చిన్నతనంలోనే తల్లిని దూరం చేసుకున్న రాజేంద్రప్రసాద్.. తన కూతురు లోనే తల్లిని చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆమె కూడా మరణించడంతో ఆయన బాధ వర్ణనాతీతంగా మారింది.
నా రెండో తల్లి కూడా వెళ్ళిపోయింది.. సాగనంపి వస్తాను అని ఆయన కన్నీళ్లతో మాట్లాడుతుంటే.. చూపరులకు మాత్రం కన్నీళ్లు ఆగలేదు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక కూతురు దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్న రాజేంద్రప్రసాద్ కు ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా నిలిచింది. ఆయన ఇంటికి వెళ్లి పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ నిన్న ఆయన ఇంటికి వెళ్లి.. పరామర్శించిన విషయం తెల్సిందే.
తాజాగా నేడు అక్కినేని నాగార్జున.. రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. గాయిత్రీ ఫొటోకు పూలు చల్లి నివాళులు అర్పించి.. రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు. నాగ్ ను చూసిన ఆయన ఎమోషనల్ అయ్యారు. చిన్నవయస్సులోనే తన తల్లి వెళ్లిపోయిందని బాధపడ్డారు.ఇక ఇంత బాధలో కూడా రాజేంద్రప్రసాద్ .. నాగార్జున కోర్టు వివాదం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా అక్కినేని కుటుంబంలో ఎన్ని వివాదాలు నడుస్తున్నాయో అందరికి తెల్సిందే. ఒకపక్క N కన్వెన్షన్ కూల్చివేత.. ఇంకోపక్క కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. కోర్టులు, కేసులు అంటూ నాగ్ తిరుగుతూనే ఉన్నాడు. ఆ విషయాలను రాజేంద్రప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. అన్ని సర్దుకుంటాయని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. రాజేంద్రప్రసాద్ కు ఆ దేవుడు ధైర్యం ప్రసాదించాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.. ఇంకోపక్క ఇన్ని కోర్టు కేసుల మధ్య కూడా సహనటుడు బాధలో ఉన్నాడని ఆయనను పరామర్శించడానికి వచ్చిన నాగ్ వ్యక్తిత్వాన్ని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.