wayanad landslide: గత కొద్ది రోజులుగా కురిసిన అతి భీకరమైన వర్షాలకు కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడ్డాయి, వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ ఊహించన విపత్తులో వందల మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటికి దాదాపు 340 మందికి పైగా ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు శిథిలాల కింద సజీవ సమాధి అయిపోయారు. ఇక ప్రాణాలతో బయటపడ్డ వారు హాస్పిటల్లో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఎంతో మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది ఇప్పటికీ దాదాపు 1500 మందికి పైగా ప్రజలకు సురక్షితంగా కాపాడారు. ఈ హఠత్పరిణామం యావత్ దేశాన్ని కలచివేస్తోంది. దీంతో వయనాడ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. ఇటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ మలయాళీ స్టార్ హీరో మోహన్లాల్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు రంగంలోకి దిగారు.
శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీబేస్ క్యాంప్కు చేరుకున్నారు. ఇందులో భాగంగానే మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా వ్యవహరిస్తున్నారు. విపత్తు ప్రాంతాన్ని సైనికులతో కలిసి సందర్శించారు. కోజికోడ్ నుంచి రోడ్డు మార్గంలో వయనాడ్కు వెళ్లిన మోహన్లాల్ అక్కడ ఉన్న ఆర్మీ అధికారులతో కలిసి చర్చలు జరిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోహన్ లాల్ స్వయంగా రంగంలోకి దిగడంతో అతడి ఫ్యాన్స్, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వయనాడ్ బాధితులకు సూర్య ఫ్యామిలీ రూ.50 లక్షల విరాళం
కాగా ఈ విపత్తు కారణంగా ఎంతో మంది తమ కుటుంబాన్ని, ఇళ్లను కోల్పోయారు. దీంతో అలాంటి వారికి సాయం చేసేందుకు సినీ ఇండస్ట్రీ కదలి వచ్చింది. ఇప్పటికీ చాలా మంది నటీ నటులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు లక్షల్లో ఆర్థిక సాయం చేశారు. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి రూ.25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కు అందించాడు. అలాగే అతడి కుమారుడు, నటుడు దుల్కర్ సల్మాన్ రూ.15 లక్షలు ఇచ్చాడు.
ఫహాద్ ఫాజిల్, అతడి భార్య నజ్రియా కలిసి రూ.25 లక్షలు అందించారు. తమిళ ఇండస్ట్రీ స్టార్లు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికీ నటుడు విక్రమ్ రూ.20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి అందించాడు. అలాగే నటుడు సూర్య, భార్య జ్యోతిక, తమ్ముడు కార్తీ కలిసి రూ.50 లక్షలు అందించారు. నటి రష్మిక సైతం రూ.10 లక్షలు ఇచ్చింది. ఇలా ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు.