Jamuna: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటి జమున(86) మృతి చెందారు. కొద్దిరోజులుగా జమున అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని తన నివాసంలో గత రాత్రి కన్నుమూశారు. జమున మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఉదయం 11 గంటలకు జమున భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్చాంబర్కు తరలించనున్నారు.
1936 ఆగష్టు 30న హంపిలో జన్మించిన జమున.. 1953లో ‘పుట్టినిల్లు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు జానాభాయి… జ్యోతిష్యుల సూచనతో ఆమె తల్లిదండ్రులు జమునగా పేరు మార్చారు. ‘మిస్సమ్మ’ సినిమాతో జమునకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటించిన జమున ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, కృష్ణ వంటి దిగ్గజ నటులతో కలిసి జమున నటించారు.