Actor Jagapathi Babu : సినిమా హీరోలకు లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఉంటారని తెలిసిన విషయమే. ఇప్పుడంటే ఒక్కో హీరోకు ఒక్కో స్టార్ ఇమేజ్ ఇచ్చేశారు కానీ.. ఒకప్పటి ఫ్యామిలీ హీరో, ఇప్పటి విలన్ జగపతి బాబు అంటే చాలామందికి ఇష్టం. ఇప్పటికీ ఆయన ఫిట్ నెస్ కు, అందానికి లేడీ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఒక్కోసారి అభిమానులు చేసే పనులు విసుగు తెప్పిస్తుంటాయి. అలా అభిమానుల తీరుతో అసహనానికి గురైన నటుడు జగపతి బాబు.. అభిమానుల వల్ల తానే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందంటూ.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అభిమానుల వల్ల తానెంతో విసిగిపోయానని చెప్పిన జగ్గుభాయ్.. కీలక నిర్ణయం తీసుకున్నారు.
33 ఏళ్ల తన సినీ జీవితంలో అభిమానులే ఎదుగుదలకు కారణమని భావించానని, వారి కష్టాలను నా కష్టాలుగా భావించి అన్నివిధాలుగా నీడగా నిలిచానని జగ్గుభాయ్ ఆ పోస్ట్ లో తెలిపారు. అభిమానులంటే ప్రేమను ఇచ్చేవారని మనస్ఫూర్తిగా నమ్మిన తనకు ఊహించని పరిణామాలు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు. కొందరు అభిమానులు ప్రేమకంటే ఆశించడం ఎక్కువైందని, తనను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని జగపతిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం చెప్పేందుకు మనసు అంగీకరించకపోయినా బాధతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇకపై తన అభిమాన సంఘాలు, ట్రస్ట్ లకు తనకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు.
అభిమాన సంఘాలు, ట్రస్ట్ ల ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలను ఇక నుంచి విరమించుకుంటున్నట్లు జగపతిబాబు స్పష్టం చేశారు. తనను ప్రేమించే అభిమానులకు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటానని తెలిపారు. చివరిలో జీవించండి.. జీవించనివ్వండి అని ఆ పోస్ట్ లో రాశారు. అయితే.. జగపతిబాబును అంతగా ఇబ్బంది పెట్టింది ఎవరన్న విషయం మాత్రం తెలియలేదు. బహుశా అభిమానులమంటూ.. ఆయన్ను పదే పదే ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం జగ్గూభాయ్ గుంటూరు కారం, సలార్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలో వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.