Jani Master Case: తన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న డ్యాన్సర్పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలపై టాలీవుడ్లోనే స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదయ్యింది. చాలామంది జానీ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని, అసలు తనను క్షమించకూడదని నిరసనలు మొదలుపెట్టారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా షేర్ చేశారు. కానీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్తో కలిసి పనిచేసిన కొందరు కొరియోగ్రాఫర్లు మాత్రం మాస్టర్ అలాంటి వాడు కాదని అంటున్నారు. తాజాగా ఆట సందీప్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు. అందులో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.
చాలా బాధపడుతున్నాను
‘‘జానీ మాస్టర్కు నేషనల్ అవార్డ్ క్యాన్సెల్ అయ్యిందని చెప్పి ఈరోజు నేను సోషల్ మీడియాలో పోస్టులు చూశాను. చూడగానే చాలా బాధ అనిపించింది. నేను ఇప్పటివరకు జానీ మాస్టర్ కేసు గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే.. ఒక ఆడపిల్ల విషయం, ఒక సున్నితమైన విషయం. వాళ్లకు వాళ్లకు ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు. చట్టపరంగా ఈ విషయాన్ని జానీ మాస్టర్ చూసుకుంటారు, ఆ అమ్మాయి చూసుకుంటుంది అనుకున్నాను. కానీ ఈరోజు ఈ మ్యాటర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ను క్యాన్సెల్ చేసే రేంజ్కు వెళ్లిపోయింది అంటే చాలా బాధపడుతున్నాను’’ అంటూ ఇన్నిరోజుల ఈ విషయంపై స్పందించకపోవడానికి కారణాన్ని బయటపెట్టాడు ఆట సందీప్.
Also Read: మాస్టర్ కు షాక్.. జాతీయ అవార్డు రద్దు.. సందిగ్ధంలో బెయిల్..!
కాలితో తన్నేశారు
‘‘ఒక డ్యాన్స్ మాస్టర్గా ఇతర డ్యాన్స్ మాస్టర్స్ ఎంత కష్టపడతారు అనే విషయం నాకు తెలుసు. ఒక సినిమా హిట్ కొట్టి, అందులో ఆ డ్యాన్స్ మాస్టర్ స్టెప్స్ హిట్ అయ్యి.. ఇంత చేసిన తర్వాత ఒక డ్యాన్స్ మాస్టర్కు లైఫ్ వస్తుంది. జానీ మాస్టర్ ఎంత కష్టపడుంటే, ఎంత కృషి చేసుంటే నేషనల్ అవార్డ్ రేంజ్కు వెళ్లుంటాడు? కరెక్ట్గా నోటి దగ్గరకు వచ్చినదాన్ని కాలితో తన్నేశారు. ఇది అస్సలు కరెక్ట్ కాద’’ అని వాపోయాడు సందీప్. అంతే కాకుండా బాధితురాలితో తనకు ఉన్న పరిచయం గురించి కూడా మాట్లాడాడు. ‘‘మేము కూడా ఆ అమ్మాయిని పనికోసం పిలిచాము. మా దగ్గర కూడా తను పనిచేసింది’’ అని చెప్పుకొచ్చాడు ఆట సందీప్.
రానని చెప్పింది
‘‘చాలా ఈవెంట్స్కు కూడా ఆ అమ్మాయిని మాతో పనిచేయడానికి పిలిచాం. నేను జానీ మాస్టర్ దగ్గర చేస్తున్నాను, ఆయన దగ్గర మాత్రమే చేస్తాను, అందుకే మీ దగ్గరకు రాలేను అని చెప్పింది. నిజంగానే తనకు అంత ఇబ్బంది ఉంటే ఒకే మాస్టర్ దగ్గర అంత సౌకర్యంగా పనిచేయదు కదా. ఒక మనిషిని కావాలని సర్వనాశనం చేయడం చాలా తప్పు. చట్టం కూడా పూర్తిగా అమ్మాయిల సైడే అయిపోయింది. దీంతో అమ్మాయిలు చాలా ఈజీగా అబ్బాయిల మీద కేసులు పెట్టేసి వాళ్ల జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు’’ అంటూ సీరియస్ అయ్యాడు ఆట సందీప్. తన భార్య జ్యోతి కూడా జానీ మాస్టర్కు తమ సపోర్ట్ అని స్పష్టం చేసింది.