Ap Elections 2024: రాయలసీమ ఎన్నికల ఫలితాలు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ చేయనున్నాయి. సీఎం అభ్యర్ధులిద్దరూ సీమ ప్రాంతం వారే.. గత ఎన్నికల్లో సీమలోని నాలుగు జిల్లాల్లో టీడీపీ దారుణంగా దెబ్బతింది. కేవలం మూడు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ఈ సారి అక్కడ ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మాజీ సీఎంలు మూడు పార్టీల నుంచి పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా తయారైంది.
రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎలక్షన్ హీట్ పీక్ స్టేజ్కి చేరింది. 2019 ఎన్నికల్లో సీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల వైసీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకే పరిమితం అయింది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ లు గెలవగలిగారు. సీమలోని 8 లోక్సభ స్థానాల్లో ఒక్కటి కూడా టీడీపీకి దక్కలేదు.
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో పాటు కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో వైసీపీనే గెలుచుకుంది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన ఒక్కరే గెలిచారు. మిగిలిన 13 సెగ్మెంట్లు వైసీపీలో ఖాతాలోనే పడ్డాయి. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే అనంతపురం జిల్లాలో ఆ పార్టీకి దక్కింది రెండు స్థానాలే.. మిగిలిన 12 చోట్ల వైసీపీ అభ్యర్ధులే గెలిచారు.
ఈ సారి కూడా అవే ఫలితాలు రిపీట్ చేయడానికి పెద్ద ఎత్తున అభ్యర్ధులను మార్చారు జగన్.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలు మార్చేశారు. కొన్ని చోట్లు కొత్త ముఖాలను తీసుకొచ్చారు. టీడీపీ కూటమి కూడా కొన్నిచోట్ల కొత్త వారికి టికెట్లు ఇచ్చినప్పటికీ.. అనుభవానికే పెద్ద పీట వేసింది. మరోవైపు కడప ఎంపీగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీలో ఉండటంతో ఈ సారి రాయలసీమలో ఎన్నికలు ఆసక్తికరంగా తయారయ్యాయి.
ఇక మరో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాజంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. దాంతో సీఎం వర్సెస్ ఇద్దరు ఎక్స్ సీఎంల మధ్య వార్ నడుస్తుంది. ఈ సారి కడప జిల్లాలో ఆరు చోట్ల ఉత్కంఠభరిత పోరు నడుస్తుంది. కడప, కోడూరు, రాయచోటి, కమలాపురం, ప్రొద్దుటూరులతో పాటు బీజేపీ పోటీ చేస్తున్న జమ్మలమడుగులో నెక్ టూ నెక్ ఫైట్ కనిపిస్తుంది. ఇక జిల్లాలోని రాజంపేట ఎంపీ స్థానం నుంచి కిరణ్కుమార్రెడ్డి, కడప ఎంపీ స్థానంలో వైఎస్ షర్మిల పోటీలో ఉండటం ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కర్నూలు జిల్లాలో ఈ సారి హోరాహోరీ యుద్దం నడుస్తుంది. మొత్తం 14 స్థానాల్లో రెండు చోట్ల పోటీ కీలకంగా మారింది. నందికొట్కూరు, పత్తికొండల్లో నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్నాయి వైసీపీ, టీడీపీలు.. పాణ్యం, నందికొట్కూరు, మంత్రాలయం, బనగానపల్లి, ఆళ్లగడ్డ లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు. ఈసారి ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: కడపలో జగన్ కు షర్మిల చెక్ పెడుతుందా.?
అనంతపురం జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో హోరాహోరీ పోరు నెలకొంది. రాయదుర్గం, తాడిపత్రి, మడకశిరల్లో ఉత్కంఠ పోరు నెలకొంది. అక్కడ ఎవరు గట్టెక్కినా స్వల్ప మెజారీతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పోల్ మేనేజ్మెంట్పైనే అభ్యర్థుల భవిష్యత్ ఆధారపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ పై ఉత్కంఠ నెలకొంది. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతిని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అటు పోల్ మేనేజ్మెంట్పై అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. తిరుపతి, సత్యవేడు, చిత్తూరు, జీడి నెల్లూరుల్లో గట్టి పోటీ నెలకొంది. ఇక చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం ఫలితం చిత్తూరు లోక్సభ స్థానంపై ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తమ్మీద సీఎం సీమలో ఎన్నికలు స్పెషల్ అట్రాక్షన్గా మారాయి.