Kashi Annapurna Devi : హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కాశీ ఒకటి. దీనినే వారణాసి అని కూడా అంటారు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పురాతన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కాశీలో నిత్యం పూజలందుకుంటున్న ‘కాశీ అన్నపూర్ణ దేవి’ అమ్మవారు అందరికీ అన్నం పెట్టే పార్వతి దేవిగా ఇప్పటికీ విరాజిల్లుతోంది. మరి అన్నపూర్ణదేవిగా అవతారమెత్తిన పార్వతి కథ తెలుసుకుందామా?
చరిత్ర..
ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ పార్వతిదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి వెళ్లిపోతుంది. దాంతో ఆహారం దొరక్క ప్రజలు అలమటిస్తుంటే.. పార్వతిదేవి తిరిగొచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి శివుడు భిక్ష పాత్రను పట్టుకుని పార్వతిదేవి వద్దకు వెళ్లి ఆహారం అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి పార్వతి దేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని విశ్వసిస్తారు.
బంగారు విగ్రహం
ఈ ఆలయంలో అన్నపూర్ణ దేవి విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో ఏడాదికోసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజుల్లో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది.