Bhagavad Gita : ఒక వృద్ధుడు రోజూ రెండుపూటలా భగవద్గీత చదివేవాడు. పుస్తకం పూర్తి కాగానే.. మరునాడు మళ్లీ మొదలుపెట్టేవాడు. ఇలా ఏళ్ల తరబడి చదువుతూ ఉన్నాడు.దాన్ని గమనించిన అతని మనవడు.. ఒకరోజు మిత్రుడితో ఎగతాళిగా.. ‘ఎప్పుడూ అదే ఎందుకు చదవటం? వేరే పుస్తకాలు కూడా చదవొచ్చుగా. జీవితమంతా అదే చదివితే.. మిగతా విషయాలు ఎప్పుడు తెలుసుకుంటావు’ అని అన్నాడు.
దానికి వృద్ధుడు ‘నువ్వూ వీలున్నన్ని సార్లు గీతాపారాయణం చేస్తే.. నేనెందుకు పదేపదే దానిని చదువుతున్నానో నీకే అర్థమవుతుంది’ అన్నాడు.నెలరోజుల తర్వాత మనవడు.. వృద్దుడి వద్దకు వచ్చి.. ‘నువ్వు చెప్పినట్లు నేను నెలరోజుల్లో అనేకసార్లు చదివాను కానీ.. అది నాకు ఏమీ ఉపయోగకరంగా లేదు’ అన్నాడు.దానికి ఆ వృద్ధుడు.. ‘నువ్వు మరిన్నిసార్లు దాన్ని చదివితేనే దాని ప్రయోజనమేంటో తెలుస్తుంది’అనగా అతని మనవడు కోపంగా ‘నీది అర్థంలేని వాదన’ అని వాదనకు దిగాడు.
దానికి వృద్ధుడు ‘ పదేపదే దాన్నెందుకు చదవాలో నీకు ఇప్పుడే చెబుతాను’ అంటూ గదిలో మూలన ఉన్న బొగ్గుల బుట్టను తీసుకురమ్మని మనవడికి చెబుతాడు.
అతడు బొగ్గుల బుట్టను తేగానే.. అందులోని బొగ్గునంతా కిందపోసిన వృద్ధుడు ‘ఈ ఖాళీ బుట్టతో ఆ వాగులో దిగి నీరు తీసుకురా’ అని ఆదేశిస్తాడు.
దానికి మనవడు వింతగా చూసి.. ‘తాతా.. చిల్లుల బుట్టతో నీరెలా తెస్తాను. బిందె తీసుకెళ్లాలి గానీ’ అని విసుక్కున్నాడు.
‘నేను చెప్పింది చేస్తే నీకే తెలుస్తుంది’ అని వృద్ధుడు అనటంతో అతని మనవడు దానిని తీసుకుని వాగులో దిగి నీటిలో ముంచి ఒడ్డుకు రావటం,నీరంతా కారిపోవటం..ఇలా ఓ పదిసార్లు జరగటంతో మనవడు కోపంతో ఇంటికొచ్చి జరిగింది చెప్పి ‘నీకు మతిపోయింది’ అంటూ వృద్ధుడిని నిందిచటం మొదలుపెట్టాడు.
దానికి వృద్ధుడు నవ్వుతూ ‘నువ్వు తీసుకెళ్లేటప్పుడు అది నల్లటి మసితో కూడిన బుట్ట. నువ్వు పదిసార్లు నీటిలో ముంచే సరికి కొత్తదానిలా మెరుస్తోంది చూశావా? అలాగే మనసుకు పట్టిన మకిలి వదలిపోవాలంటే.. భగవద్గీతను పదేపదే చదవాలి. వెంటనే దాని ప్రభావం నీకు అర్థం కాకపోయినా.. కొంతకాలానికి గానీ నీలో కలిగిన ఆ మార్పును గుర్తించలేవు’ అని ఉదాహరణతో చెప్పాడు.