Gopuram : దేవాలయం ఒక వ్యక్తికీ ఒక కుటుంబానికీ సంబంధించి వుండదు. సార్వజనిక ఆస్థిగా పరిగణింపబడుతూ, పోషింపబడుతూ, రక్షింపబడుతూ, దర్శింపబడుతూ వుండాలి. దాతలేవరైనా దేవాలయానికి దానాదికాలను చేయవచ్చు. పోషకులుగా వుండవచ్చు. వేశ్యలు కూడ దేవాలయాలను కట్టించి దాఖలాలు ఎన్నో వున్నాయి. సర్వజనానీకానికీ, పొరుగు ఊరి నుంచి వారికీ ఇతర దేశీయులకి, కొత్తగా వచ్చిన వారికీ దేవాలయం ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవటానికి ఆలయగోపురం ఎత్తుగా వుండాలి.
దేవాలయ గోపురమే కాదు దేవాలయం కూడా ఎత్తుమీద వుండటం మంచిది. అందుకే ఎన్నో దేవాలయాలు కొండలు గుట్టలు చూచుకొని మరీ నిర్మిస్తారు. ఎందుకంటే, మానవు డెంతటి తెలివికలవాడై ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేదు! వరదబీభత్సాల తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవలసిందే. అటువంటి ప్రకృతి ప్రళయ సమయాలలో ప్రాణాలు కాపాడగల్గిన స్థలం దేవాలయమే!
దేవుడు సర్వోన్నతుడు! ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారీ మనిషికి, మనస్సుకీ బోధపడటానికి దేవాలయాన్నీ దేవాలయగోపురాన్నీ ఎంత వీలైతే అంతగా ఎత్తుకి నిర్మిస్తారు. హిందూ దేవాలయాలేకాదు. మసీదుకి కూడా పొడవైన స్తంభం నిర్మిస్తారు. చర్చికి కూడా ముందు భాగంలో ఎత్తుగా దూరానికి కన్పించే విధంగా అంతస్థు నిర్మించి గంటను కడతారు.