Ayodhya:అయోధ్యలో రామమందిరం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీతారాముల విగ్రహాలను తయారు చేయడానికి సాలిగ్రామ శిలలను నేపాల్ నుండి అయోధ్యకు తరలించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు సాలిగ్రామ శిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేపాల్ గండకీ నుంచి ఈ శిలలను అయోధ్యకు చేర్చారు. నేపాల్ నుంచి రెండు ట్రక్కుల్లో 30 టన్నుల బరువున్న రెండు సాలిగ్రామ రాతి ఫలకాలు అయోధ్యకు తరలించారు.. అందులో ఒకటి 23 టన్నుల బరువు ఉండగా, మరొకటి 15 టన్నుల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాళ్లు అత్యంత అరుదుగా ఉంటాయట. ఆ రాళ్ళ ను శాలిగ్రమ రాళ్లు అని పిలుస్తారు. ఆ రాళ్లను కట్ చేస్తే లోపల విష్ణు చక్రం మాదిరిగా కనిపిస్తుంది.
ఈ భారీ శిలలకు పూజలు జరిపి, మమూల విగ్రహాలను తయారు చేస్తారు. శాలిగ్రామ శిలలు 6కోట్ల సంవత్సరాల నాటివని భక్తుల బలమైన విశ్వాసం. నేపాల్ నుంచి అయోధ్యకు తీసుకొచ్చే మార్గంలో శిలలకు భక్తులు పూజలు చేశారు. పలు చోట్ల ఘనస్వాగతం కూడా పలికారు. శ్రీ మహా విష్ణువు అవతారంగా సాలిగ్రామ శిలలను హిందువులు భావిస్తారు. నేపాల్లోని కాలీ గండకీ నది పరిసరాల్లో మాత్రమే ఈ సాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి.
సీతాదేవి పుట్టిన చోటుగా చెప్పుకునే ప్రాంతం నుండి ఈ రాళ్ళను తెప్పించి పవిత్రమైన అయోధ్యకు తరలించారు. హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ సాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ శిలలు 6కోట్ల ఏళ్ల నాటివనే నమ్మకం ఉంది. ఈ సంవత్సరం ముగిసే లోపే ముందే సాలిగ్రామ శిలతో అయోధ్య రాముడి విగ్రహం సిద్ధం చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్య రామమందిరంలో సీతాదేవి విగ్రహాన్ని కూడా సాలిగ్రామ శిలతో తయారు చేయనున్నారు. ఈ రెండు విగ్రహాల తయారీ తర్వాత గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారు. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. జనవరి 2024లో రామమందిరాన్ని ప్రారంభిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.