Coconut :సనాతన హైందవ సంస్కృతిలో భగవంతుని పూజలో కొబ్బరికాయకు విశేష ప్రాముఖ్యత ఉంది. కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి ఆలయానికి అభిముఖంగా గల అఖిలాండం లేదా అఖండం వద్ద రాత్రింబవళ్లు భక్తులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. శ్రీవారి భక్తులు దర్శనానంతరం అఖిలాండం వద్దకు విచ్చేసి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ సమర్పించడం ఆనవాయితీ.
అఖిలాండం వద్దగల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం ఎదుట నిలబడి శ్రీవారి మహద్వార గోపురంతోపాటు ఆనందనిలయాన్ని భక్తులు దర్శిస్తుంటారు. సామాన్య భక్తులతో పాటు విఐపిలు సైతం ఇక్కడ నిలబడి స్వామివారిని ప్రార్థిస్తారు.
శ్రీవారి ఆలయం లోపల కర్పూరం వెలిగించడం, కొబ్బరికాయలు సమర్పించడం చేయకూడదన్నది పండితుల మాట. బ్రహ్మోత్సవాల సమయంలో అఖిలాండం వద్ద నుంచి చూస్తే శ్రీవారి ఆలయం విద్యుద్దీపకాంతులతో శోభాయమానంగా గోచరిస్తుంది. కాలినడకన ఏడుకొండలను అధిరోహించే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్న తరువాత అఖిలాండం వద్దకు చేరుకుని పూజలు చేయడంతో వారి పాదయాత్ర ముగిసినట్లవుతుందని కొందరి నమ్మకం.
అనివార్య కారణాలు తిరుమల శ్రీవారిని దర్శించుకోలేని వారు సైతం అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి మొక్కు సమర్పించుకుంటూ ఉంటారు. 4 లక్షలు ఆదాయం వస్తుంది. ఇందుకు అవసరమైన కొబ్బరికాయలను, కర్పూరంను టిటిడి మార్కెటింగ్ విభాగం కొనుగోలు చేస్తుంది. వీటిని విక్రయించేందుకు శ్రీవారి పోటుకు చెందిన నలుగురు సిబ్బంది, 3 షిప్ట్లలో 60 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు.
ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు నలుగురు శ్రీవారి ఆలయ సిబ్బంది సమక్షంలో 15 మంది అన్నప్రసాదం సిబ్బంది కొబ్బరిచిప్పలను సేకరించి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంకు తరలిస్తారు. ధర్మగిరిలోని వేద పాఠశాల, వకుళాభవనంలో వంట తయారీకి, శ్రీవారి పోటులో ప్రసాదాల తయారీకి వినియోగిస్తారు.