Panchanga Sravanam : తెలుగు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణాన్ని నిర్వహిస్తుంటారు. తిధి వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈఐదు అంగములు కలిస్తే పంచాంగం. మానవుల జీవితాలు కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు గిట్టేవరకు వాని భవిష్యత్తు గ్రహ సంచారంమీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రములను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది.
పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతుంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక దారి చూపించేంది. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం.
శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్లీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.
సంపదల్ని కోరుకునే వారు తిథియందు, దీర్ఘాయువు కోరేవారు వారం యందు, పాప విముక్తిని కోరుకునేవారురు నక్షత్రమునందు, ఆరోగ్యము అభిషించే వారు యోగమునందు, కార్యసిద్ధిని కాంక్షించేవారు కరణముపై శ్రద్ధ వహించాలని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. పంచాంగ శ్రవణం చేసిన వారికి సూర్యభగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, గురుడు-సంపదను, కుజుడు- శుభాన్ని, బుధుడు-బుద్ధిని, కుజుడు- సుఖాన్ని, శని- ఐశ్వర్యాన్ని, రాహువు- బాహు బలాన్ని, కేతువు-కులాధిక్యాన్ని కలిగిస్తారు. ప్రతి ఒక్కరు సాయంత్రం దేవాలయాలలో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి.