Lord Shiva : హిందూ పురాణాల్లో మన్మథుడి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందమైన రూపం, విల్లు, బాణాలు, సువాసనలు వెదజల్లే పూలతో అందరిలోనూ తాపాన్ని కలిగిస్తుంటాడు. కానీ మన్మథుడు ఒకానొక సమయంలో శివుని మూడో కన్నుకు భస్మమవుతాడు. అందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు భూలోకంలోనే కాకుండా దేవ లోకంలోనూ దేవతలందరినీ బాధిస్తుంటాడు. చిత్రహింసలతో వేధిస్తూ ఉండేవాడట. దీంతో తారకాసురున్ని ఎలాగైనా వధించాలని అనుకుంటారు దేవతలు. కానీ ఆ పని శివుని కుమారుడికే సాధ్యమవుతుంది. అయితే అప్పటికి శివుడు ఇంకా బ్రహ్మచారే. ఈ క్రమంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, తపస్సుకు భంగం కలిగించి, అతనిలో విరహ తాపం కలిగించి పార్వతికి దగ్గరయ్యేలా చేసి ఆమె ద్వారా శివుడు పుత్రున్ని కనేలా చేయాలని దేవతలు భావిస్తారు. అయితే శివుని తపస్సుకు భంగం కలిగించేందుకు దేవతలందరూ మన్మథున్ని పంపుతారు.
అప్పుడు మన్మథుడు తపస్సు చేసుకుంటున్న శివునిపై పూలబాణం వేస్తాడు. దీంతో పరమ శివుడు ఆగ్రహంతో ఊగిపోతాడు. మన్మథున్ని మూడో కన్నుతో భస్మం చేస్తాడు. దీంతో దేవలంతా శివుడ్ని వేడుకుంటారు. నిజం తెలుసుకున్న శివుడు మన్మథున్ని మళ్లీ బతికిస్తాడు. అయితే అలా శివుడు మన్మథున్ని భస్మం చేసిన ప్రాంతమే ఇప్పుడు కామేశ్వర్ ధామ్గా ప్రసిద్ధిగాంచింది. అక్కడ
శివుని మూడో కన్ను వల్ల ఓ మామిడి చెట్టు కాండం సగం వరకు కాలిపోతుంది. అయితే ఆ చెట్టు ఇప్పటికీ ఆ ధామ్లో అలాగే ఉంది. అది సగం కాలిపోయి మనకు కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని రాముడు ఓసారి దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. కామేశ్వర్ ధామ్ ఉత్తర ప్రదేశ్లోని బల్లియా అనే ప్రాంతంలో ఉంది. శివుడు మూడో కన్ను ప్రభావానికి గురైన ఆ చెట్టును, అక్కడి ఆలయాన్ని దర్శించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు