Pushkara snanam: ఈనెల 22న గంగా పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. పుష్కరాలు జరిగే ఈ పన్నెండురోజులూ గంగా నది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బదిరీనాథ్, కేదారనాథ్, వారణాసి, అలహాబాద్ క్షేత్రాలు పుష్కరశోభను సంతరించుకుంటున్నాయి. పుష్కర స్నానం చేస్తే పదేళ్ల పాపాలను పుష్కరస్నానాలు కడిగేస్తాయి. మన మనసులోని మాలిన్యాలను కడిగిస్తాయని నమ్మకం. ఈ మనోస్నానం మనిషిని మనీషిగా మారుస్తుంది. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు పన్నెండు రోజుల పాటు జరుగుతాయి. పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల స్త్రీ, పురుషుల పుట్టినప్పటి నుంచీ చేయబడిన పాపం తొలగిపోతుంది అని నమ్మకం. ఆ సమయంలో మనమే కాదు, ముక్కోటి దేవతలు నదిలో స్నానం ఆచరించి తరిస్తారని భక్తుల విశ్వాసం.
పుష్కరస్నానం తర్వాత వచ్చేది ఇంట్లో చేసే స్నానం. ఎక్కువ వేడిగానీ, బాగా చల్లగా ఉన్న నీటితో గానీ స్నానం చేయకూడదు. గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం వలన శరీరానికి హాయి చేకూరుతుంది. రోగులు, చిన్నపిల్లలు దీనికి మినహాయింపు. హడావుడిగా కాకుండా ఒక పద్ధతిలో స్నానం ఆచరించాల్సి ఉంటుంది. స్నానం చేయటం అనేది ఒక విధి మాత్రమే అనుకుని ముగించుట కన్నా అది ఒక భోగంలా సంతృప్తిగా అనుభవించుట నేర్చుకోవాలి. అందుకే ఆనాడు స్నానఘట్టాలు, స్నాన గదులకు మన వారు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి వుంటారు.
ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరికి స్నానం ఎలా చేయాలోనన్న విషయం అస్సలు తెలియదు. హడావుడిగా స్నానం చేయడం అలా నాలుగు మగ్గులు ఒంటి మీద నీళ్లు చల్లుకుని స్నానం అయ్యిందనిపించుకుని పనులకు బయలుదేరడం.. ఇలా చాలామంది చేస్తుంటారు. మరికొంత మంది అసలు మొత్తం శరీరం తడవకుండానే స్నానం అయిపోయిందనిపిస్తుంటారు. అయితే.. ఈ విధంగా స్నానం ఆచరించడం ఏమాత్రం సరైంది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.