AyyappaSwami and Parashuram : శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు సుమారు ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్న కొండను ఎక్కాల్సి ఉంటుంది.అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్న కొండను ఎక్కిన తర్వాత అయ్యప్ప గుడి ముందు ఉండే బంగారు మెట్లు ఎక్కి మొక్కుతూ హరిహరసుతుడ్ని దర్శించుకుంటూ ఉంటారు.41 రోజులపాటు కఠిన దీక్ష సాగించిన స్వాములు ఇరుముడి ధరించి శబరిమలను దర్శించుకుంటారు. స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి. దీన్నే పదునెట్టాంబడి అంటారు. పవిత్రమైన ఆ మెట్ల వెనుక పురాణ కథనం ఉంది. అఖండ సాలగ్రామ శిలతో వీటిని పరశురాముడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శబరిమలను పరశురామ క్షేత్రం అంటారు.
ఈ మెట్లను మానవుని స్థూల, సూక్ష్మ శరీరాలకు ప్రతీకగా చెబుతారు. అయ్యప్పస్వామి మణికంఠునిగా 12 ఏళ్లు పందలం రాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో కొలువుదీరడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం దేవతా రూపాలు దాల్చి పద్దెనిమిది మెట్లుగా రూపుదాల్చారట. అయ్యప్ప వాటిమీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని చేరుకున్నాడని పురాణ కథనం. ఈ మెట్లను అధిరోహించడం ద్వారా అవిద్య, అజ్ఞానం తొలగిపోయి.. స్వామి అనుగ్రహం లభిస్తుందని దీక్షధారుల నమ్మకం.పంచ భూతాలు, మనిషి వేటి వల్ల ఇబ్బంది పడుతున్నాడో వాటిని మెట్లుగా మలిచి పరశురాముడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి.
పూర్ణ సంఖ్య అయిన 18, పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం.ఇంత విశిష్టత ఉన్న 18 మెట్లను నెయ్యి ఉన్న కొబ్బరికాయలు నెత్తిన పెట్టుకుని శబరిగిరిశుడ్ని తలుచుకుంటూ.. ఆ నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయించడం వల్ల సర్వం సిద్దిస్తుందని విశ్వాసం.కార్తీక మాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్ప పూజ విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణం మార్గశిరంతో ముగుస్తుంది.