Kurukshetra Yudham : ఈ భూమిపై జరిగిన అతి పెద్ద మహాయుధ్దం మహాభారత యుద్దం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు, పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది.ఆ యుద్ధం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరిగింది. కనుకనే దీనిని కురుక్షేత్ర యుద్దం అని కూడా అంటారు.
ద్వాపర యుగంలో జరిగిన ఆ యుద్దంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నది. కౌరవుల తరపున 11 అక్షౌహిణుల సైన్యం పాల్గోనగా, పాండవుల తరపున 7 అక్షౌహిణుల సైన్యం పాల్గోంది. అయితే 18 రోజులపాటు జరిగిన ఆ మహా యుధ్దంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం సమూలంగా తుడిచిపెట్టుకు పోయింది.
భరత ఖండంలో ఉన్నటువంటి చక్రవర్తులు, మహా రాజులు, యోధులు, వీరులు వారి గుర్రాలు, ఏనుగులు, రధాలు.. ఇలా సమస్తం 18 రోజులలోనే సర్వనాశనం అయిపోయాయి. చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది.. ఆ యుద్దం తర్వాత తిరిగి కోలుకోడానికి భరత ఖండానికి 4 తరాలు పట్టింది. మహా భారత యుద్ధంలో 18 కి విశేష ప్రాధాన్యత ఉంది, సైన్యంలో ఏ విభాగాన్ని కూడినా వచ్చేసంఖ్య 18, ఇరు సైన్యాలను కలిపితే 18 అక్షౌహిణులు అవుతాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలుంటాయి, యుధ్ధం కూడా 18 రోజులే జరిగింది. ఈ విధంగా 18 సంఖ్య భారతంలో విశిష్టతను సంతరించుకుంది.
అయితే ఆ యుద్దంలో పాల్గోన్న సైన్యం సంఖ్యను లెక్కించడానికి ” అక్షౌహిణి” అనే పదం ఉపయోగించారు. అయితే అక్షౌహిణి అంటే ఎంత మంది ఉంటారు.. మొదలైన సమస్త సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
1 అక్షౌహిణి అంటే – 21వెయ్యి 875 రధములు – 21 వెయ్యి 875 ఏనుగులు – 65 వేల 610 గుర్రాలు – 1 లక్షా 9 వేల 350 మంది కాల్బలం అంటే పదాతిదళ సైనికులు ఉంటారు. వీటన్నీంటిని కలిపి 1 అక్షౌహిణిగా పిలుస్తారు.
ఇంకా వివరంగా చూస్తే..
1 రధము – 1 ఏనుగు – 3 గుర్రాలు – 5 మంది సైనికులను కలిపి – 1 పత్తి అంటారు.. దీనికి సారధిని పత్తిపాలుడు అంటారు.
3 రధములు – 3 ఏనుగులు – 9 గుర్రాలు – 15 మంది సైనికులను కలిపి – 1 సేనాముఖము అంటారు. దీనికి సారధిని సేనాముఖి అంటారు.
9 రధములు – 9 ఏనుగులు – 27 గుర్రాలు – 45 మంది సైనికులను కలిపి – 1 గుల్మము అంటారు. దీనికి సారధిని నాయకుడు అంటారు.
27రధములు – 27ఏనుగులు – 81 గుర్రాలు – 135మంది సైనికులను కలిపి – 1 గణము అంటారు. దీనికి సారధిని గణనాయకుడు అంటారు.
81 రధములు – 81 ఏనుగులు – 243 గుర్రాలు – 405 మంది సైనికులను – 1 వాహిని అంటారు. దీనికి సారధిని వాహినిపతి అంటారు.
243 రధములు- 243 ఏనుగులు – 729 గుర్రాలు- 1215 మంది సైనికులను – 1 పృతన అంటారు. దీనికి సారధిని పృతనాధిపతి అంటారు.
729 రధములు- 729ఏనుగులు – 2 వేల 187 గుర్రాలు – 3వేల645 మంది సైనికులను – 1 చమువు అంటారు. దీనికి సారధిని సేనాపతి అంటారు.
2వేల187 రధములు- 2వేల187 ఏనుగులు – 6వేల561 గుర్రాలు – 10వేల935 మంది సైనికులను – 1 అనీకిని అంటారు. దీనికి సారధిని అనీకాధిపతి అంటారు.
దీనికి 10 రెట్లు కలిపితే 1 అక్షౌహిణి సైన్యం అవుతుంది. దీనికి సారధిని మహా సేనాపతి అంటారు.
అయితే ఇంకాస్త వివరంగా చూస్తే.. 3 పత్తులు కలిపి – 1 సేనాసముఖము అంటారు.
3 సేనాముఖములను కలిపి – 1 గుల్మము అంటారు.
3 గుల్మములను కలిపి – 1 గణము అంటారు.
3 గణములను కలిపి – 1 వాహిని అంటారు.
3 వాహినులను కలిపి – 1 పృతన అంటారు.
3 పృతనలను కలిపి – 1 చమువు అంటారు.
3 చమువులను కలిపి – 1 అనీకిని అంటారు.
10 అనీకినిలను కలిపి – 1 అక్షౌహిణి అంటారు.
సో..మహాభారత యుద్దంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది. అంటే మొత్తం.. 3 లక్షల 93 వేల 660 రథములు, 3 లక్షల 93 వేల 660 ఏనుగులు, 11 లక్షలు 80 వేల 980 గుర్రాలు, 19 లక్షల 68 వేల 300 మంది సైనికులు అవుతారు. ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు రథ సారథి కూడా ఉంటాడు. అలాగే గజబలంలో యుద్ధవీరునితో పాటు మావటి కూడా ఉంటాడు.. అలాగే అశ్వాలపై 1 వీరుడు ఉంటాడు. వీరిని కూడా కలుపుకుంటే.. రథబలం 7 లక్షల 87 వేల 320, అలాగే గజబలం 7 లక్షల 87 వేల 320 అవుతుంది, అశ్వబలం 23 లక్షల 61 వేల 960, పదాతిదళ సైనికులు 19 లక్షల 68 వేల 300 మంది, ఇలా మెత్తం 59 లక్షల 4 వేల 900 మంది ఆ యుద్ధంలో తుడిచి పెట్టుకుపోయాయి.
చివరకు ఆ యుద్దంలో మిగిలింది పాండవుల పక్షాన ధర్మారాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుడు,శ్రీ కృష్ణుడు, సాత్యకి. కౌరవుల పక్షాన అశ్వధ్దామ, కృపాచార్యుడు, కృతవర్మ.. మెత్తం 10 మంది మాత్రమే మిగిలారు. ఎప్పుడో 5000 సంవత్సరాలకు ముందు ద్వాపరయుగంలో జరిగిన యుధ్దంలో 59 లక్షలు చనిపోయారంటే అది సామన్యమైన విషయం కాదు కదా? ఈ విధంగా ఆ యుద్ధం అసంఖ్యాక విధవ మహిళలని మిగిల్చి తద్వారా ఆర్థిక మాంధ్యానికి కారణమై కలియుగానికి దారితీసిందని చెప్పవచ్చు.