Lord Rama : త్రిపురాసుర సంహారానంతరం దేవరాతుడు అనబడే జనకుని వంశ పూర్వీకునికి ఇవ్వగా ఆ నాటి నుండి వారి వద్ద పూజలందుకుంటూ ఉంది. విశ్వామిత్రుడి యాగ సంరక్షణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, యాగం పూర్తికాగానే ఆ బ్రహ్మర్షి వెంట మిథిలా నగరంలోని జనక మహారాజు ఆస్థానానికి చేరుకుంటారు. విశ్వామిత్రుడు చెప్పిన మీదట జనక మహారాజు శివధనుస్సును రామలక్ష్మణులకు చూపించటానికి సిద్ధపడి, ఆ ధనస్సును తీసుకురావల్సిందిగా తన మంత్రులను ఆదేశిస్తాడు.బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన ఐదువేల మంది పురుషులు, ఎనిమిది చక్రాలున్న శకటం మీద అమర్చి ఉన్న శివధనుస్సును అతికష్టంతో తోసుకుంటూ తీసుకువస్తారు.
నాగ, కిన్నర, కింపురుష, యక్ష, రాక్షసులు సహా సమస్త దేవతా గణాలకు ఈ ధనుస్సును ఎక్కుపెట్టడం సాధ్యం కాలేదని జనకుడు విశ్వామిత్రుడితో చెబుతాడు. వెంటనే విశ్వామిత్రుడు రామా! ఈ ధనుస్సును చూడు అంటాడు. అంతే మహర్షి వాక్యంలోని అంతరార్థం గ్రహించిన రాముడు ఆ ధనుస్సు మధ్యభాగాన్ని చేతితో పట్టుకుని, ఎంతో అలవోకగా ఎక్కుపెడతాడు. కేవలం రాముడి చేతి స్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడి చేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి అల్లెత్రాటిని లాగుతాడు. మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోకభీకరమైన శబ్దం చేస్తూ, శివధనుస్సు రెండుగా విరిగిపోతుంది.
శాస్త్ర పరిభాషలో ధనుస్సు అంటే ఓంకారం అని అర్థం. ప్రణవం ఎవరికైతే వంగుతుందో, అటువంటి వ్యక్తికి మన ఆత్మను అర్పించాలి. ఇక్కడ ధనుస్సు రూపంలో ప్రణవం రామచంద్రునికి వంగింది. అంటే, మన ఆత్మను అర్పించడానికి తగిన దైవం శ్రీరాముడు. శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు. వారెవరికీ అది సాధ్యం కాలేదని కేవలం రాముడికే సాధ్యమైంది.
శివ ధనుస్సు లాగానే విష్ణు ధనుస్సు కూడా ఉంది. అది పరశురాముని వద్ద ఉంటుంది. ఎప్పుడయితే రాముడు శివ ధనుస్సుని విరిచి సీతని పరిణయమాడతాడో, అప్పుడు అది తెలిసిన పరశురాముడు ఈ విష్ణుధనుస్సుని, ఆయన శక్తిని కూడా రామునికి ఇచ్చేసి హరిహరులని ఏకం చేస్తాడు.