Kondagatu: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం 400 ఏళ్ల క్రితం జరిగింది. ఆంజనేయుడు స్వయం భూ గా వెలిశాడని.. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయ స్వామి కనిపించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయింది. ఆ అవును వెదుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టుకింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి.. తాను కోరంద పొదలో ఉన్నాను. తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని.. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు.
సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, ‘శ్రీ ఆంజనేయుడు’ కంటపడ్డాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని ఊరిజనమంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
ఆంజనేయుడు శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైనఉంది. ఇక్కడికి ప్రతి మంగళ, శని వారాలలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.ఆంజనేయునికి 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పండుగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
ఏటా చైత్ర పౌర్ణమిరోజు హనుమాన్ చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఆసమయంలో లక్షలాది దీక్షాపరులు అంజన్నను దర్శించుకొని ముడుపులు కట్టివెళ్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజుల పాటు హోమం నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. ,ఐత్ర శుద్ధనవమి రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుగుతుంది.