Lies:ఇప్పటికీ అబద్ధమాడితే ఆడపిల్ల పుడుతుంది అని బెదిరించడం చూస్తూనే ఉంటాం. నేటికీ గ్రామాల్లో ఆటలు ఆడుకునేటప్పుడు వచ్చిన గొడవల్లో చిన్నపిల్లలు తోటి వారితో ఇలాగే అంటూ ఉంటారు. చాలా ఏళ్ల నుంచి మన సంస్కృతిలో ఆడపిల్ల అంటే మైనస్, అబ్బాయి అంటే ప్లస్ అని భావిస్తూ ఉంటారు. అబ్బాయి ప్లస్ ఎందుకు అవుతాడు.అమ్మాయి పెళ్లి అయ్యాకా అత్త వారింటికి వెళ్లి పోతుంది. కష్టపడి పెంచి, చదివించి, బాగా ఖర్చు చేసి పెళ్లి చేస్తే, ఆమె అత్తవారింట సేవలు చేస్తుంది. అందుకే అమ్మాయి ఆ..డ పిల్ల గానీ, ఈడ అంటే ఇక్కడ పిల్ల కాదు అనే భావనతో గతంలో భావించేవారు. అందుకే ఆడపిల్ల అయినా, ఆమెను కన్నవారిని అయినా జాలిగా, లోకువగా చూసే ఓ దుష్ట సంస్కృతి పెరిగిపోయింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. చివరికి అబద్ధాలు ఆడిన వారికి ఆడ పిల్లలు పుడతారు అనే చెడు మాట వ్యాప్తి చేశారు.
నిజానికి మన భారతీయ సంస్కృతిలో ఆడవారికి విశిష్ట స్థానం ఉంది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నల వివాహం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. దశరథ మహారాజు బృందానికి ఎదురు వెళ్లి స్వాగతం పలికారు జనక మహారాజు. అపుడు దశరథుడు జనకునికి పాదాభివందనం చేశాడు. జనకుడు ఇదేంటని ఆశ్చర్యంగా అడిగితే…మా వంశం అభివృద్ధి చెందటానికి మీ ఇంటి అమ్మాయిలను నా పుత్రులకు ఇచ్చి వివాహం చేస్తున్నారు. ఇందుకు మేము సదా కృతజ్ఞులై ఉండాలి.” అన్నాడు. అబ్బాయిలను కన్నామని గర్వించేవారు, దశరధుని ఆదర్శంగా తీసుకోవాలి.
అబద్ధం ఆడడం తప్పు, మంచి పద్దతి కాదు అంటే జనాలు వినరు. కాబట్టి, వారికి భయం కలిగేలా అబద్ధం చెపితే శిక్షగా ఏదో కష్టమో అనర్థమో జరుగుతుందని భయం పుట్టిస్తే కొంత వరకైనా ఆగుతారని, ఆడపిల్ల పుడితే అంతా ఖర్చు, భారం కాబట్టీ, అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనే సామెత పుట్టింది. ఆడపిల్లలు పెళ్ళి అయిన తరువాత మరొకరి వంశంలోకి వెళ్ళి వాళ్ళ వంశాన్ని వృద్ధి చేస్తారు. దాని వల్ల ఆ అమ్మాయి తండ్రి వంశం వృద్ధిచెందదు. అదే, మగపిల్లవాడు పుడితే, వాడి వివాహం ద్వారా తండ్రి వంశం పెరుగుతుంది. ఆ ఉద్దేశ్యంతోనే, అబద్ధాలు ఆడేవారిని నిజాలు చెప్పే దారికి మళ్ళించడానికి అబద్ధం ఆడితే ఆడ పిల్లలు పుడతార అనేవారు.