Badrinath : హిందూమతంలో పితృకార్యాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. మనల్ని కని పెంచి పెద్ద చేసి జీవిత గమనాన్ని నిర్దేశించే తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచాక సంతానం కొన్ని కార్యాలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. అది భయంతో భక్తితో కాదు ప్రేమతో. అలాంటి కర్మను నిర్వహించేందుకు ప్రథమ ప్రాధాన్యం దక్కే ప్రదేశం బద్రీనాథ్. పితృకార్యాలకు బద్రీనాథ్ పెట్టింది పేరు. చనిపోయిన పెద్దలకి నరక బాధల నుంచి విముక్తి కలిగించేందుకు పితృకార్యాలు నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది. కాలం మారినా పద్దతుల్లో మార్పులు వచ్చినా ఈ తంతు నేటికీ కొనసాగుతోంది. అందుకే ప్రత్యేకించి బద్రీనాథ్ లో పితృకార్యాలు నిర్వహించి వారికి పుణ్య లోకాలు కలిగే చేయాలని ఆ బద్రీనాథుడ్ని వేడుకుంటారు.
ఈ కర్మలు చేసేందుకు చాలా ప్రదేశాలు ఉన్నా బద్రీనాథ్ లోని బ్రహ్మకపాలం ప్రాంతంలోనే ఎక్కువ మంది చేయడానికి శ్రమపడి వస్తుంటారు. బద్రీనాథ్ కి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది ఈ బ్రహ్మకపాలం. బద్రీనాథ్ వెళ్లిన వారు బ్రహ్మకపాలానికి వెళ్లకుండా రారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే వారికి ఇతర తీర్థయాత్రలకి వెళ్లిన దానికన్నా ఎనిమిది రెట్లు పుణ్యం కలుగుతుందని నమ్మకం.పోయిన పెద్దలకి శాశ్వత స్వర్గ ప్రాప్తి కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. అలకనందా నది ఒడ్డున పది అడుగుల బండ కనిపించే ప్రాంతమే బ్రహ్మకపాలం.
బ్రహ్మకపాలం ఏర్పడటం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అసత్యమాడిన బ్రహ్మ తలను నరకాలని శివుడు ఆదేశించగా బైరవుడు తూచా తప్పకుండా పాటిస్తాడు. అలా బ్రహ్మతలపడిన ప్రాంతమే బ్రహ్మకపాలం. తనకి పాప విముక్తి కలిగించాలని శివుడ్నికోరగా బైరవుడి ఈ ప్రదేశానికి వెళ్తే దోష నశిస్తుందని సెలవిస్తాడు. శివుడి వరంతో పితృ కార్యాలకి బ్రహ్మకపాలంగా ప్రసిద్ధికెక్కింది.
బ్రహ్మ తలకి మోక్షం కలిగిన ప్రాంతం ఇక్కడ పితృకార్యాలు నిర్వహిస్తే పెద్దలు పుణ్యలోకాలకు ప్రాప్తించడమే కాదు ఆ కార్యాలు నిర్వహించిన వారి దోషాలు సమసిపోతాయని స్థల పురాణం చెబుతోంది.