Vyasa Kasi Temple : వేదవ్యాసుడు 18 పురాణాలను, ఉపనిషత్తులను రచించాడు. ఒకటిగా ఉన్న వేద సముదాయాన్ని నాలుగుగా విభజించినదీ ఆయనే.
మహా తపస్వి అయిన వ్యాసుడిని.. సాక్షాత్తూ శివుడే కాశీ నుంచి బహిష్కరించాడు. ఆ కథేమిటంటే..
పూర్వం వ్యాసుడు తన శిష్యులతో కలిసి కాశీ పట్టణంలో ఉంటూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు.
ఒకరోజు పార్వతీ పరమేశ్వరులకు ఆయనను పరీక్షించాలని అనిపించింది.
ఆ రోజు మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ శివపార్వతుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు. మూడు రోజులు ఇలాగే సాగాయి.
సాక్షాత్తూ అన్నపూర్ణాదేవి ఉన్న కాశీలో ఇదేమి వింత? అని ఆయన ఆవేదన చెందాడు. ఆకలి కారణంగా ఆ ఆవేదన.. ఆగ్రహంగా మారింది.
కాశీలో ఒక్కరోజు నివసించినా పుణ్యమనే మాటతో.. శాశ్వతంగా ఇక్కడ నివసిస్తున్న కాశీవాసులకి అహంకారం పెరిగి, దానం చేయటం లేదని వ్యాసుడు భావించాడు.
దీంతో.. ‘కాశీ వాసులు 3 తరాల వరకు ఆకలితో అలమటించాలి’ అని శపించేందుకు సిద్ధపడుతుండగానే.. బాగా వృద్ధురాలైన ఓ ముత్తయిదువ.. వ్యాసుడిని, అతని శిష్యులను భోజనానికి ఆహ్వానించి విందుభోజనం పెడుతుంది.
అనంతరం ఆమె ‘మహాశక్తి వంతుడవైన నువ్వే.. 3 రోజుల ఆకలికి తట్టుకోలేకపోయావా?’ అనగానే.. ఆమె ఎవరో ఆయనకు అర్థమైంది. నా పట్టణాన్ని శపించేందుకు సిద్ధమయ్యావుగా’ అని చీవాట్లు పెడుతుంది.
మరుక్షణమే శివుడూ ప్రత్యక్షమై ‘నాకు ఇష్టమైన నగరాన్ని శపించేందుకు సిద్దమైన నీకు ఇక్కడ చోటు లేదు. తక్షణం వెళ్లిపో’ అని శపించాడు.
దీంతో వ్యాసుడు.. కన్నీరుమున్నీరవగా, కరిగిపోయిన ఈశ్వరుడు.. ‘గంగ దాటి 5 క్రోసుల దూరంలో ఉండు. పండుల వేళ మాత్రం నీకు ప్రవేశం ఉంటుంది’ అని శాపాన్ని సవరిస్తాడు.
కాశీకి సమీపంలో నాటి నుంచి వ్యాసుడు నివసించే ప్రదేశాన్నే నేడు మనం వ్యాసకాశీగా పిలుస్తున్నాం.