Shiva Temple:దేశంలో కొన్ని ఆలయాలు నదుల తీరం వెంబడి , ఇంకొన్ని సముద్రపు ఒడ్డుకు ఆనుకొని ఉన్నాయి. అయితే చాలా తక్కువ ఆలయాలు మాత్రం సంగమ స్థలాలల్లో కొలువై ఉన్నాయి
అంటే నది సముద్రం కలిసే చోటు కాని, ఒక నది మరో నదిలో కలిసే ప్రదేశంలో కాని ఆలయాలు నిర్మించారు. ఇలా సంగమం ప్రాంతంలో నిర్మించిన ఆలయాల సందర్శన చేస్తే పంచ హత్య మహాపాతకాలు నశించిపోతాయని హిందూ భక్తులు నమ్ముతారు..అందువల్లే పుణ్యక్షేత్రాల సందర్శనపై నమ్మకం ఉన్న వారు తీర్థయాత్రలో భాగంగా తప్పకుండా ఈ సంగమ క్షేత్రాలను సందర్శనకు వెళ్తుంటారు. ఈకేటగిరిలోకి చెందినదే శ్రీ అగస్త్యేశ్వస్వామి ఆలయం. ఇది అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఆలయం. 6000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఆలయం ఇది.
పూర్వం అగస్త్య మహాముని దేశసంచారం చేస్తూ కృష్ణా, ముచికందా సంగమ స్థానం లో సాయం సంధ్యావందనం పూర్తిచేసి ధ్యానం లో ఇదో గొప్ప దివ్యస్థలం అని గుర్తించి శివలింగం,లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్టించి పూజించి,అభిషేకించి ముందుకు యాత్రకు వెళ్లినట్టు చరిత్ర చెబుతోంది.ఆ తర్వాత పుట్టలు పట్టి సుమారు 5,400 సంవత్సరాలు స్వామి పుట్టల్లోనే ఉన్నారు. రెడ్డిరాజుల పరిపాలనా కాలంలో పుట్టలో ఉన్న స్వామి బయటకొచ్చారు.
ఈ ఆలయంలో కొలువైన శివలింగంలో నీరు నిల్వ ఉండటం విచిత్రం. అలాగని నీరు తీయకుండా వదిలేస్తే పొంగిపొర్లవు. పూజారి నీళ్లు సేకరించి భక్తులపై చల్లినప్పుడు అదే పరిమాణంలో మళ్లీ నీళ్లు ఊరుతాయి. క్రీస్తుశకం 1524లో శ్రీ శంకరాచార్యలు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ బిలం లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక ఉద్దరిణికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారు. ఎంత సమయమైనా ఆ తాడు లోపలికి వెళుతూనే ఉంది. దీంతో ఆ తాడును పైకి లాగారు. ఆ ఉద్దరిణికి రక్త మాంసాలు అంటుకున్నాయి కాని ఆ బిలం లోతు తెలియలేదు. ఈ వివరాలను తెలుపుతూ అక్కడ రాతి శాసనం కూడా వేయించాడు. సదరు శాసనాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు.
నరసింహుడి ఉచ్ఛ్వాస.. నిశ్వాసలతో మహిమాన్వితంగా సంగమ తీరంలో కొలువైంది. ఈ క్షేత్రం పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. స్వామి రూపం ఉగ్రత్వం నిండి ఉంటుంది. గర్భాలయంలోని 2 దీపాలలో ఒకటి నిరంతరం మిణుకు మిణుకుమని కనిపిస్తుంటుంది. ఈ దీపమే స్వామి వారి ముక్కుకు దగ్గరలో ఉంటుంది. స్వామి వారి ఉచ్చ్వాస-నిశ్వాసవల్లే ఈ దీపం కదలాడుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం నదీ సంగమంలో ఉండడటంతో ఇక్కడ అస్థికలు లు నిమజ్జనం కూడా చేస్తుంటారు. ఈ వాడపల్లి శ్రీ అగస్త్యేశ్వస్వామి సందర్శనం చేస్తే భూత, ప్రేత పిశాచాల భయం ఉండదని స్థానిక భక్తుల నమ్మకం