TTD Cancels SSD Tokens For Three Days: తిరుమల రథ సప్తమి వేడుకల అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి 3 రోజులపాటు అంటే శనివారం వరకు కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయడం నిలిపి వేశారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ సూచించింది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కొనుగోలు చేసిన భక్తులు నిర్దేశించిన సమయంలోనే శ్రీవారి దర్శనం చేసుకోవాలి. లేదంటే టోకెన్ లేని భక్తులతో కలిపి వారిని వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి పంపుతారు. ఈ నెల 16న రథసప్తమి ఉత్సవాల నేపథ్యంలో సామాన్య భక్తులను దృష్టిలో పెట్టు ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ప్రకటించింది.
రథసప్తమి రోజు శుక్రవారం ప్రోటోకాల్ ఉన్న వీఐపీలను మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. దివ్యాంగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు నిలిపివేశారు. ఫిబ్రవరి 16 వరకు గదుల కేటాయింపు కోసం సీఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. టీబీ, ఎంబీసీ కౌంటర్లను మూసివేశారు.
Read More: బాబా చెప్పిన అన్నదాన నియమాలు….!
రథసప్తమి రోజు శ్రీవారి ఆలయంలో వివిధ సేవలను టీటీడీ రద్దు చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను నిలిపివేసింది.
సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా జరుగుతాయి. భక్తులకు శ్రీవారి ప్రసాదం తగినంత అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రసాదం కౌంటర్లలో 4 లక్షల లడ్డూలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా మరో 4 లక్షల లడ్డూలను అందుబాటు ఉంచేందుకు చర్యలు చేపట్టారు.