Toli ekadashi 2024: ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి జరుపుకుంటారు. ఏకాదశి హిందువులకు ప్రత్యేకమైన తిథి. సాధారణంగా 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది. కానీ జులైలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకత ఉంది. ఆషాడంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజు మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ రోజు ఉపవాస నియమం కూడా పాటిస్తారు. ఈ ఏకాదశి నుంచి విష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళతాడని చెబుతారు. సృష్టి భారం స్వామిపై పడుతుందని నమ్ముతారు.
ఈ ఏడాది ఏకాదశి జులై17వ తేదీన జరుపుకుంటాం. అయితే ఏకాదశి రోజు విష్ణువును పూజిస్తే స్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారని విశ్వసిస్తారు. ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్లిన స్వామి సరిగ్గా నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు.
తొలిఏకాదశి స్వామిని పూజించి ఉపవాసం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు, ఆయురారోగ్యాలతో ఉంటారని చెబుతారు. ఏకాదశి శుభ సమయం, పూజా విధానం, పఠించాల్సిన మంత్రం, నైవేద్యం, ఉపవాస సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి ఏకాదశి ప్రత్యేకత:
ఉదయ తిథి ఆధారంగా ఏకాదశిని ఈ ఏడాది జులై17న జరుపుకుంటున్నాం. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తం నుంచి ఏకాదశి ఆరాధన చేయవచ్చు. ఉదయం సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అందుకే ఆ సమయంలో ఏం చేసినా విజయవంతం అవుతుంది. ఏకాదశి రోజు సర్వార్థ సిద్ది యోగం, అమృత సిద్ధియోగం, శుభ యోగం, శుక్ల యోగం ఏర్పడతాయి. అయితే ఈ యోగాలన్నీ పూజలు, శుభ కార్యాలు నిర్వహిచేందుకు మంచివి. ఈ సమయంలో ఏ పని చేసినా మీకు కలివస్తుంది కాబట్టి నూతన కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించుకోవచ్చు.
ఏకాదశి శుభ సమయం:
ఏకాదశి, తిథి ప్రకారం జులై 16, రాత్రి 08:33 గంటల నుంచి జులై 17 రాత్రి 09:02 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు అనగా జులై 18 రోజు ఉదయం 05:35 నుంచి 08:20 గంటల మధ్య ఉపవాస విరమణ చేయవచ్చు.
ఏకాదశి పూజా విధానం: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలంటు స్నానం ఆచరించాలి. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీహరి విష్ణువుకు జలాభిషేకం చేయండి. అనంతరం పంచామృతాలతో పాటు గంగా జలంతో స్వామికి అభిషేకం చేయండి. ఆ తర్వాత పసుపు, చందనంతో అలకంరించండి. ఆ తర్వాత పసుపు రంగు పుష్పాలతో స్వామిని పూజించండి. అనంతరం దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించండి.
ఉపవాస దీక్ష: ఏకాదశి రోజు ఉపవాసం పాటించడం అత్యంత పవిత్రంగా చెబుతారు. ఏకాదశి రోజు ఉపవాస సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సమేత లక్ష్మీ దేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. తులసి లేకుండా విష్ణువు, దేవికి నైవేద్యం సమర్పించకూడదు.
నైవేద్యం:
స్వామికి నైవేద్యంగా బెల్లం, పప్పు, ఎండు ద్రాక్ష, అరటి వంటివి సమర్పించాలి. ఏకాదశి రోజు శ్రీ విష్ణు చాలీసా పఠించాలి. అరటి చెట్టును కూడా పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఉపవాసం పాటించిన వ్యక్తి మరణం అనంతరం మోక్షం పొందుతారని చెబుతారు.