Tirumala : ప్రతీరోజు వేలాదిమంది భక్తులు సందర్శించే తిరుమలలో శ్రీవారి సేవ చేయాలనుకునే వారికి టీటీడీ సదా తలుపు తెరిచే ఉంచుతోంది. ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజుల పాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంటుంది. స్వామి వారి సన్నిధిలో సేవ చేయాలకునే వారికి ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండి తీరాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి. ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే అవుతారు.
శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్లో అందించాల్సి ఉంటుంది. వలంటీర్ల వయసు పద్దెనిమిది 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.డాక్టర్ తో అటెస్ట్ చేయించిన మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలి . కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.
సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.
శ్రీవారి సేవాసదన్లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్లు ధరించాలి. గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలన్న నిబంధన ఉంది. రోజుకు కనీసం 6 గంటలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహాయం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవగానే పరిగణిస్తారు. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. అలాగే పలానే సేవ కావాలంటూ ఒత్తిడి చేయకూడదు. సేవా సదన్లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించకూడదు. టీటీడీ నిబంధనలు పాటించని వారిని రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు. తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9 నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.