Tirumala tirupathi facts : శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా తిరుమలలో కొలువుదీరి ఉన్నాడు. వెంకన్న ఆలయం ఏడు ద్వారాలతో నిర్మితమైవుంది. వీటిని వైకుంఠ ద్వారాలుగా వ్యవహరిస్తారు. కులశేఖరపడి, రాములవారి మేడకు రెండు ద్వారాలు, జయ, విజయ, బంగారు, వెండి ప్రధాన ద్వారాలుగా ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారాలు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని వెంకటేశ్వరుని దర్శిస్తున్నాం. దాని పరామర్థం మనలో ఉన్న బ్రహ్మనాడిల ఏడు కేంద్రాలున్నాయి. జీవుడు ఆత్మను చేరాలంటే ఏడోవ స్థానానికి చేరాలి. అందుకే స్వామి నేను ఏడవ గదిలో ఉన్నాను. నన్ను చేరాలంటే మీలో ఉన్న ఏడు ద్వారాలు దాటండి. అప్పుడు నా రూపాన్ని, అంతర్యాన్ని చూడగలరని స్వామి దర్శనంలో పరామర్థం ఉంది.
శ్రీవారి గర్భాలయం 7.2 అడుగుల మందంతో 12.9 అడుగుల చతురస్ర మండపం శ్రీవారి గర్భాలయం. శ్రీవారి గర్భాలయంపై ఆనంద నిలయాన్ని 1244-50 సంవత్సరాల నడుమ నిర్మించారట. సాలగ్రామ రూపంలో కొలువైన శ్రీవారి గర్భాలయంలో వంశ పారంపర్య అర్చకులు, జీయర్ స్వాములకు మినహా మరెవ్వరికి అనుమతి ఉండదు. శ్రీవారి గర్భాఆలయంలో పంచ బెరలు కొలువై ఉంటాయి. మూలమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు మూర్తి, ఉగ్ర శ్రీనివాస మూర్తి, మలయప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడే ఉంటాయి. శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీ సీత రామ లక్ష్మణ విగ్రహాలు, చక్రతాళ్వార్ విగ్రహాలు స్వామి వారి గర్భాలయంలోనే ఉంటాయి. భక్త ప్రియున్ని దర్శించాలంటే ఇన్ని మండపాలు దాటాల్సిందే.
ఏడు కొండల స్వామికి ఏడు సంఖ్యతో ఎంతో అనుబంధం ఉంది. వృషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి, శేషాద్రి, గరుడాద్రి, తీర్థాద్రి అనే ఏడు కొండలకు ప్రతీక. 1958లో ఆరంభించిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమం ఇప్పటికీ ఆరుసార్లు పూర్తయింది. ఏడవ ద్వాదశవసంతంలో స్వామి అడుగులు వేశారు. అలాగే ఏటా జరిగే తిరుమల శ్రీవారిగే బ్రహ్మోత్సవాలకు కూడా ఏడు సంఖ్యతో అనుబంధం వుంది. బ్రహ్మోత్సవంలో స్వామివారు 16 వాహనాల్లో ఊరేగుతారు. దీనిని కూడితే ఏడు వస్తుంది. ఆ వాహనాలు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, దంతపల్లకి, గరుడ, స్వర్ణరథం, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, రథ, అశ్వ వాహనములు 16గా చెబుతారు.