Garuda Pournami:ఈ నెల 5న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడని టీటీడీ పేర్కొంది. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి చెప్పకనే చెబుతారు. ఈ పౌర్ణమి గరుడ సేవలో స్వామివారి భక్తులు దర్శించుకుని తరించారు. గరుడ పౌర్ణమిని నాడు స్వామి వారి దర్శనం చేసుకుంటే సర్వపాపాలు నశిస్తాయి.
గరుడ పౌర్ణమి రోజున తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నట్లు తెలిపింది. పురాణాల ప్రకారం తిరుమలలో 3.50కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయి. వీటిలో సప్త తీర్థాలు ముఖ్యమైనవిగా చెబుతారు. ఇందులో పుష్కరిణి తీర్థం, కూమారధార తీర్థం, తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, పాండవ తీర్థం ముఖ్యమైనవి. ఆయా తీర్థాల్లో భక్తులు స్నానాలు చేస్తే ముక్తిమార్గం పొందుతారని అంటారు.
అయితే, శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మాఘమాసం రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఆలయానికి ఆరుమైళ్ల దూరంలో ఉన్న ఈ తీర్థానికి పౌర్ణమి రోజున ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. పున్నమి రోజున ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రితో తీర్థం వద్దకు వెళ్లి రామకృష్ణ తీర్థంలో వెలిసిన రామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.