Clock Temple :గుడికి వెళ్లిన వారు కొంతమంది వారి కోరికలను దేవుడికి చెప్పి ముడుపులు కడతారు..మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరికాయలు లేదా ఏదైనా వస్తువుతో ముడుపులు కడతారు కానీ ఓ ఆలయం లో మాత్రం ముడుపులుగా గోడ గడియారాన్ని కడతారట. ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ సమీపంలో ఓ ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళినవారు ఆశ్చర్యపోకమానరు. అక్కడ ఉన్న చెట్టుకు పెద్ద సంఖ్యలో గడియారాలు వేలాడుతూ ఉంటాయి. ఆ క్షేత్రంలో కొలువుదీరిన బ్రహ్మబాబాకు గడియారాలు సమర్పించడం ఎప్పటినుంచో ఆనవాయతీగా వస్తోంది. ఈ దేవాలయానికి అన్ని రకాల మతస్తులు వస్తారట. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు… ఇలా అందరూ తమతమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకుంటారు.
గతంలో ఓ వ్యక్తి తనకు డ్రైవర్ కావాలనుందని, అందుకవసరమైన మెళకువలు చెప్పాలని బ్రహ్మబాబాకు మొక్కుకున్నాడట. అతని కోర్కె తీరి డ్రైవర్ అవడంతో స్వామికి ఓ గడియారాన్ని సమర్పించుకున్నాడు. అప్పటి నుంచి ఇక్కడ గడియారాలు మొక్కు రూపేణా చెల్లించడం సంప్రదాయంగా మారింది. ఈ ఆలయ బాధ్యతలన్నీ గ్రామస్తులే చూస్తుంటారు. ముడుపులు కట్టే చెట్టుకు రక్షణ ఏమీ లేకున్నా గడియారాలు ఎవరూ ముట్టుకోరని గ్రామస్తులు తెలిపారు.
ఇలాంటి సెంటిమెంట్ మరో చోట కూడా ఉంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం ఉంది.ఆ ఆలయం ముందు పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. స్థానికులు పెద్ద ఎత్తైన ఆ మర్రి చెట్టు కొమ్మలకు గోడ గడియారాలు కడుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా ఆ బాబాని స్థానికులు పూజిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీరిన వారు వచ్చి బాబా గుడిలో గడియారాలను చెట్టుకు కట్టేసి వెళతారు.
ప్రస్తుతం ఆ చెట్టుకు దాదాపుగా 3వేలకిపైగా ఉంటాయి. గతంలో ఒక భక్తుడు తమ కోరిన కోరిక తీరితే తమ ఇంట్లోనే అత్యంత ఖరీదైన గడియారాన్ని ముడుపుగా ఇస్తానంటూ మొక్కుకున్నాడు.ఆయన కోరిక తీరడంతో గడియారాన్ని ముడుపుగా ఇవ్వడం జరిగిందట. అప్పటి నుంచి కూడా ఆయన కుటుంబీకులు చుట్టు పక్కల వారు ఆలయంలోని మర్రి చెట్టుకు గోడ గడియారాలను ఇవ్వడం జరుగుతూ వస్తోంది.