Undavalli Caves: గుంటూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి ఒకటి.
పేరుకు ఇది గుంటూరు జిల్లాలో ఉన్నా విజయవాడకు సమీపంలో ఉంటుంది. ఇక్కడి గుహాలయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి.
తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని ఓ కొండను గుహగా తొలిచారు. అజంతా..ఎల్లోరా శిల్పాల తరహాలోనే ఈ గుహల్లో కళానైపుణ్యం ఉట్టిపడుతుంది.
క్రీస్తు శకం 2, 3 శతాబ్దంలో ఈ ప్రాంతంలో బౌద్ధమతం మంచి ఆదరణ పొందిన కాలంలో ఈ గుహల నిర్మాణం జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం.
నాలుగు అంతస్థులుగా చెక్కిన ఈ గుహల్లో 64 స్తంభాలతో కానాలుగా మలిచారు. మొదటి అంతస్థులో 14 చిన్నచిన్న గుహలున్నాయి.
ఇక.. రెండవ అంతస్థులో 19 అడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పైన అనంత పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం, మూడవ అంతస్థులో త్రికూటాలయం చూపరులను ఆకట్టుకుంటాయి.
ఇక్కడి శిల్పాల శైలిని బట్టి ఇవి చాళుక్యుల కాలం నాటివని కొందరి అభిప్రాయం. అప్పట్లో బౌద్ధ భిక్షువులు కృష్ణానదిలో స్నానం చేసి ఉండవల్లి గుహల వద్ద సేదదీరేవారట.
ఈ గుహలపై ఉన్న స్థంభాలపై చెక్కిన పూర్ణకుంభాన్ని.. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంగా స్వీకరించారని చెబుతారు. 1959లో పురావస్తు శాఖ ఈ గుహాలయాలను తన స్వాధీనంలోకి తీసుకుని నిర్వహిస్తోంది.