Hanuman-Junction: విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే హైవేలో ప్రయాణిస్తుంటే.. ఒకచోట బ్రహ్మాండమైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ మార్గంలో ప్రయాణించే వారంతా అక్కడికి రాగానే జై హనుమాన్ అంటూ ఆ స్వామికి నమస్కరించకుండా ముందుకు సాగరు.
83 ఏళ్ల చరిత్ర గల ఈ ఆంజనేయ స్వామి దేవాలయం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉంటుంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండగా, మెట్లు మాత్రం కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తాయి.
ఏలూరు రోడ్, గుడివాడ రోడ్, నూజివీడు రోడ్, విజయవాడ రోడ్.. ఇలా ఈ 4 రహదారులు కలిసే ఈ కూడలిని.. బ్రిటిషర్ల కాలంలో జంక్షన్ అనేవారు. ఆ తర్వాత అది హనుమంతుని పేరిట.. హనుమాన్ జంక్షన్ అయింది.
1938వ సంవత్సరంలో నూజివీడు ప్రాంతమంతా జమీందారు శ్రీ ఎం.ఆర్ అప్పారావు గారి పాలనలో ఉండేది. ఆయన తండ్రిగారైన మేకా వెంకటాద్రి బహద్దూర్ గారు అప్పట్లో ఏదో పనిమీద ఈ జంక్షన్ ప్రాంతానికి వచ్చారట.
ఆ సమయంలో ఆయనకు విపరీతమైన ఆకలి వేసిందట. ఆయన వెంట వచ్చిన వారి దగ్గరా తినేందుకు ఏమీలేకపోవటంతో.. చుట్టుపక్కల ప్రాంతంలో ఏమైనా ఆహారం దొరకుతుందేమోనని సేవకులంతా తెగ వెతికారట.
కానీ.. ఆ ముళ్లపొదలు, బీడువారిన భూములున్న ఆ నిర్మానుష్య ప్రదేశంలో వారికి ఏమీ దొరకకపోవటంతో ఆయన ఆకలికి తట్టుకోలేక.. ఒకచోట కూర్చుండిపోగా.. సేవకులంతా కాస్త దూరంగా నిలబడి ఉన్నారు.
ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఒక పెద్ద కోతి ఆయన వద్దకు వచ్చి.. తన చేతిలోని అరటి పండును ఆయన చేతిలో పెట్టి వెళ్లిపోయింది. దానిని తినగానే.. జమీందారు గారికి ఆకలి బాధ తొలగటమే గాక.. ఎంతో శక్తి వచ్చిన, దివ్యమైన అనుభూతి కలిగిందట.
తన ఆకలి బాధను చూడలేక.. సాక్షాత్తూ ఆ ఆంజనేయుడే ఇలా వచ్చి ఆదుకున్నాడని భావించిన జమీందారు గారు ఆ జంక్షన్లో నిలువెత్తు ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి పూజలు నిర్వహించారు. అనంతర కాలంలో స్వామికి సరిగ్గా ఎదురుగా.. రోడ్డుకు అవతలివైపు రామాలయం నిర్మించారు.
కాలంతో బాటు ఈ ఆలయాన్ని విస్తరించటమే గాక ఇప్పడు మనం చూసే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ నిర్మించారు.