Arya Samaj : అది 1824వ సంవత్సరం. గుజరాత్ కథియవాడ్ ప్రాంతంలోని ఠంకారా గ్రామం. ఆ రోజు మహాశివరాత్రి. రాత్రి 10 గంటల వేళ.. శివాలయంలో ఊరిజనమంతా భజన చేస్తున్నారు. భజనలు తారస్థాయికి చేరుతుండగా.. జనంలో భక్తి పొంగిపొరలుతోంది.
అక్కడ తండ్రితో బాటు కూర్చున్న 14 ఏళ్ల మూలాశంకర్ తివారీ అనే బాలుడూ ఉన్నాడు. ఈ బాలుడు మాత్రం చక్కగా అలకంరించిన శివలింగం వైపే చూస్తూ ఉన్నాడు.
ఇంతలో.. ఒక ఎలుక గర్భాలయంలోకి వెళ్లటం బాలుడు గమనించాడు. అది నేరుగా శివలింగం మీద ఎక్కి కూర్చోవటం, మరునిమిషంలో కిందకి దిగి.. స్వామికి నైవేద్యంగా పెట్టిన పదార్ధాలన్నీ కొరకటం, పూలదండలు, తీర్థం పాత్రలను ఎంగిలిచేయటం బాలుడు చూశాడు.
ఇదంతా చూసిన పిల్లాడి మనసులో ఏకకాలంలో అనేక ప్రశ్నలు ఉదయించాయి. ‘ఇదేంటి.. లోకాలను కాపాడే శివుడి మీదికి ఒక చిట్టెలుక ఎలా ఎక్కింది? ఆయన తినాల్సిన ప్రసాదాన్ని ఆ అల్పజీవి ఎంగిలి చేసినా శివుడు శిక్షించడేమిటి?’ అనుకున్నాడు.
ఇదే మాటను తండ్రినీ అడిగాడు. ‘దేవుడి గురించి అలా అనకు.. కళ్లు పోతాయ్’ అనే జవాబొచ్చింది. కానీ.. ఆ సంఘటన బాలుడిని సత్యాన్వేషణ దిశగా నడిపించింది.
ఆ బాలుడికి 18 ఏళ్లు వచ్చేసరికి కలరాతో చెల్లెలు చనిపోయింది. ‘మనిషి మరణాన్ని ఎందుకు జయించలేకపోతున్నాడు’ అనే దిశగా అతని ఆలోచనలు సాగాయి. సమాజంలో దేవుడి పేరుతో జరుగుతున్న మోసాలూ.. ఆ యువకుడి మనసును మెలిపెట్టాయి.
ఆ సమయంలోనే మధురలోని మహర్షి విరజానంద ఆశ్రమానికి వెళ్లి.. స్వామిని కలిసి తన ప్రశ్నలను ఆయన ముందుంచాడు. తర్వాత స్వామీజీ సూచన మేరకు అక్కడ వేదశాస్త్రాలు అభ్యసించారు. స్వామీజీ చేతుల మీదగా సన్యాసాన్ని స్వీకరించి స్వామీ దయానంద సరస్వతిగా మారాడు.
అనేక రుగ్మతలతో బాధ పడుతున్న సమాజానికి వేదాల సారాన్ని అందించి చైతన్యపరచాలనే గురు ఆదేశం మేరకు 1875, ఏప్రిల్ 10న ముంబయిలో ఆర్య సమాజ్ని ప్రారంభించారు.
కులమతాలకు అతీతంగా అందరూ వేదాధ్యయనం చేయాలని, భగవంతుడు సర్వవ్యాపకుడు కనుక విగ్రహారాధన అవసరం లేదని చెప్పారు.
బాలికా విద్య, కులాంతర వివాహాలకు ఆర్యసమాజాన్ని కేంద్రంగా నిలిపటంతో బాటు మతం మారిన హిందువులను తిరిగి స్వధర్మం వైపు నడిపించారు.