Shirdi Sai Baba : పరమాత్మను చేరేందుకు సద్గురు సాయినాథుడు మనకు అనేక మార్గాలను సూచించారు. అంతేకాదు.. భగవంతుని పట్ల మనం ఎంత విధేయత, విశ్వాసం కలిగి ఉండాలనే సత్యాన్ని ఆయన తన జీవితంలో అనుక్షణం ఆచరించి చూపించారు. దేవునికి వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించటం అంటే.. మనల్ని మనం అర్పించుకోవటమేనని బాబా తరచూ చెప్పేవారు.
దైవాంశ సంభూతుడైనప్పటికీ.. సాయిబాబా తనను తాను గొప్ప దైవాన్నని ఎన్నడూ చెప్పుకోలేదు. తాను కేవలం పరమాత్మ అప్పగించిన పనిని నెరవేర్చేందుకు వచ్చిన వాడిననే చెప్పేవారు. భగవంతుని పట్ల ఎంత ప్రేమగా, వినయంగా ఉండేవారో.. తనను ఆశ్రయించిన భక్తుల పట్లా, నోరులేని జంతువుల పట్లా అంతే ప్రేమను, విధేయతను చూపేవారు.
సృష్టిలో దైవాన్ని మించింది ఇంకేదీ లేదని సాక్షాత్తూ పరమాత్మ స్వరూపుడైన బాబా నిగర్వంగా చెప్పేవారు. ఒక సందర్భంలో పరమాత్మను ఉద్దేశించి ‘నేను బానిసల్లో బానిసని. నీకెంతో రుణపడి ఉన్నాను. నీ అపురూపమైన దర్శనంతో ఎనలేని ఆనందం కలుగుతోంది. సంతృప్తి చెందుతున్నాను. నీ పాదసేవ చేసుకోవడం నా అదృష్టం. ఈ భాగ్యాన్ని నాకు ఎన్నడూ దూరం చేయకు…’ అన్నారు.
సాయిబాబా తాను చెప్పినదానిని చివరి వరకు ఆచరించి ఒక ఉత్తమ గురువుగా నిలిచారు. భగవంతుడు ఇవ్వలేనిది ఏమీలేదని, ఆ పరమాత్మ జ్ఞానానికి, కీర్తికి ఆకాశమే కొలమానమని బాబా వివరించేవారు. దేవునికి ఒకరి పట్ల ప్రత్యేక ప్రేమగానీ, మరొకరి పట్ల ద్వేషం గానీ ఉండవనీ, ఆయన అందరి మీదా ఒకేలా తన కరుణను చూపుతాడని బోధించేవారు.
మనుషులుగా మనమంతా ఈ లోకలోకి వచ్చింది.. ఇక్కడి విలాసాలను అనుభవించేందుకు కాదనీ, జనులంతా సమయాన్ని వ్యర్ధం చేయటం మాని, భగవన్నామస్మరణతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాబా తరచూ చెప్పేవారు. భక్తులు, భగవంతుని చేరుకునే మార్గం సులభమైందేమీ కాదనీ, అయితే.. సద్గురువును ఆశ్రయించి, నిరంతర అభ్యాసం చేస్తే అది సులువుగా మారుతుందని ప్రబోధించారు.
సాయిబాబా తనను దైవంగా గాక.. కేవలం గురువుగానే భావించాలని చెప్పేవారు. బాబా చూపిన దయ,జాలి, కరుణ, వినమ్రత, విధేయతలను మనమూ మన నిజ జీవితంలో అలవరచుకుందాం. వీలున్నమేరకు ఆచరణలో పెడదాం. వ్యర్థ వాదనలో కాలాన్ని వృధా చేయకుండా బాబా నామస్మరణతో మన జీవితాన్ని సార్ధకం చేసుకుందాం.