Stone Arches:తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే జానపదుల జాతర ఐనవోలు. పుట్టమన్నుతో పూజలు అందుకునే మల్లికార్జున స్వామి కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దివ్యమంగళ క్షేత్రమిది. ముఖ్యంగా శివ భక్తులకు ప్రీతికరమైన క్షేత్రం. ధ్వజారోహణంతో సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు కొనసాగడం ఇక్కడ ప్రత్యేకత.
చాళుక్య, కాకతీయ నిర్మాణ శైలిలో ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అద్భుత శిలాసంపదకు నిలయమైన ఈ దేవాలయంలో అష్టోత్తర స్తంభాలు, విశాల ఆలయ ప్రాంగణం, రాతి ప్రాకారాలతో ఎంతో అందంగా నిర్మితమైంది. రాష్ట్ర కూటుల కాలంలోనే ఐనవోలు గ్రామం ప్రస్తావన ఉంది. దాదాపు 1100 ఏళ్ల నుంచే ఐనవోలు ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
సుమారు 10 అడుగుల ఎత్తులో విశాల నేత్రాలు, కోర మీసాలతో మల్లన్న రూపం దర్శనమిస్తుంది. కోర మీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో ఖండేలు రాయుడిగా దర్శనమిస్తారు. ఇంకో వైపు గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాణిమల్లసూరుల శిరస్సులు కనిపిస్తాయి మల్లన్న ప్రధానంగా యాదవుల, కురుమల ఇష్టదైవం.
సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో ఐనవోలులో జాతర జరుగుతుంది. బోనాలు చేసి స్వామివారికి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. ఒగ్గు పూజారులు ఢమరుకాన్ని వాయిస్తూ, రంగురంగుల ముగ్గులేసి, జానపద బాణిలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు.మల్లన్న ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తితోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణానికి పూర్వమే వీటిని నిర్మించాడని చరిత్ర చెబుతోంది.