Suchindram Temple : దక్షిణ భారతంలో ఉన్న అత్యంత విశిష్ట శైవక్షేత్రాల్లో శుచీంద్రంలోని శివాలయం ఒకటి. శుచి అంటే శుభ్రం చేయటం. భక్తుల మనసులోని కల్మషాన్ని తొలగించి, వారికి పరమాత్మను దర్శించే శక్తిని ప్రసాదించే క్షేత్రమిది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారికి 13 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు.. స్థాణుమలయన్ అనే పేరుతో.. విష్ణువు, బ్రహ్మలను తనలో కలుపుకున్న లింగాకారంలో దర్శనమిస్తాడు. ఈ శివలింగపు పైభాగంలో శివుడు(స్థాను), మధ్యలో విష్ణువు(మల్), కింది భాగంలో బ్రహ్మ(అయన్) ఈ ముగ్గురు మనకు దర్శనం కల్పిస్తారు.
తనను పరీక్షించటానికి వచ్చిన త్రిమూర్తులను అనసూయా దేవి.. తన పాతివ్రత్య మహిమతో వారిని బాలురిగా మార్చిన క్షేత్రంగానూ ఇది ప్రసిద్ది చెందింది. అయితే లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనసూయ దేవిని వేడుకొనగా వారికి విముక్తి కల్పించిందనీ, ఆ సమయంలో త్రిమూర్తులు ముగ్గురు స్వయంభువుగా ఒకే లింగంపై వెలిశారని పురాణాలు చెబుతాయి.
ఇంద్రుడు అహల్య విషయంలో పొందిన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడి స్వామి వారిని పూజించి, కాగుతున్న నెయ్యిలో మునిగి శాపవిమోచనం పొందాడట. అప్పడు.. స్వామి దయతో.. శాపం కారణంగా ఆయన ఒళ్లంతా ఏర్పడిన కళ్లు.. పోయి పూర్వరూపాన్ని పొందినట్లు స్థలపురాణం చెబుతోంది. నాడు దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకే ఈ క్షేత్రానికి ‘శుచీంద్రం’ అని పేరొచ్చింది. నేరం చేసిన వారిని ఆలయంలోని ఉదయమార్తాండ మండపంలో పంచాయితీ పెట్టి, సలసల కాగుతున్న నేతిలో చేతులుంచి, బొబ్బలు రాకుంటే.. ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించటమనే ఆచారం ఇటీవలి కాలం వరకు కొనసాగింది.
ఆది శంకరులు.. ఈ క్షేత్రాన్ని సందర్శించినపుడు పరమశివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా చూశాడట. ఈ క్షేత్రంలోనే పరమశివుడు.. ఆది శంకరాచార్యుల వారికి స్వయంగా ప్రణవ మంత్రాన్ని ఉపదేశించారని పురాణ గాథ.
సుమారు 134 అడుగుల ఎత్తు గల గోపురం, సంగీత స్వరాలు వినిపించే ఆలయ ముఖ మండపంలోని రాతి స్తంభాలు, ఎక్కడా కనిపించని రీతిలో 26 ముఖాలు, 52 చేతులున్న శివుని అరుదైన శిల్పం, 22 అడుగుల హనుమాన్ విగ్రహాలున్నాయి. లంకాదహనం జరిగిన సమయంలో ఆంజనేయుని తోక అంటుకోవడంతో గాయాల పాలైన హనుమను శాంతింపజేసేందుకు నేటికీ భక్తులు ఆయన తోకకు వెన్నను రాస్తుంటారు. దీనివల్ల ఆ స్వామి కరుణిస్తాడని భక్తుల నమ్మకం.
శుచీంద్రానికి సమీపంలోని కొలచెల్ అనే చారిత్రక ప్రదేశంలోనే పూర్వం యుద్ధానికి వచ్చిన డచ్ సేనలను మార్తాండ వర్మ, ట్రావెన్కూరు రాజులు తీవ్రంగా ప్రతిఘటించి ఓడించారు.