Mopidevi Temple : పరమశివుడు, సుబ్రహ్మణ్యుడు పరమశివుని అవతారంగా, లింగాకారంలో పూజలందుకునే ఏకైక క్షేత్రం.. మోపిదేవి. నాగదోషాలను, సంతానలేమిని, కుజదోష నివారణతో బాటు జ్ఞానవృద్ధిని కలిగించే దైవంగా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యుడికి గొప్ప పేరుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాలోని ఈ క్షేత్రం ఉంది. విజయవాడ కు 70 కి.మీ దూరంలోను, మచిలీపట్టణానికి 35 కి.మీ దూరంలోను, రేపల్లె కు 8 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది.
స్కాంద పురాణం ప్రకారం.. వింధ్య పర్వతం అహంకారంతో సూర్యుడంత ఎత్తుకు పెరిగిపోగా, ప్రపంచమంతా గాలి, వెలుతురు స్తంభించి దేవమానవ లోకాలు అల్లాడిపోయాయి. దీంతో దేవతల కోరిక మేరకు కాశీలో ఉన్న అగస్త్య మహాముని.. ఆ పర్వతపు పొగరు అణచేందుకు పూనుకుని భార్య లోపాముద్రా దేవి సమేతుడై దక్షిణ భారతానికి బయలుదేరి వచ్చాడు.
ఆయన రాకను గమనించిన వింధ్య పర్వతం తల వంచి నమస్కరించగా, ‘నేను దక్షిణాదికి వెళుతున్నాను. నేను వచ్చే వరకు అలాగే తల దించి ఉండు’ అని ఆదేశించి ముందుకు సాగిపోయాడు. అలా ఆయన గోదావరీ తీరాన్ని దాటి, కృష్ణాతీరంలోని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు. అక్కడికి రాగానే.. ‘వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్’ అనే మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయట.
పుట్టలతో నిండి ఉన్న ఆ ప్రదేశంలో నిలబడిన అగస్త్య మహాముని దంపతులు, ఆయన బృందం అక్కడ నిలబడి గమనించగా, ఒక పుట్టనుంచి కళ్లు మిరుమిట్లు గొలిపే దివ్యకాంతి రావటం గమనించారు. సాక్షాత్తూ సుబ్రహ్మణ్యుడు ఇక్కడ సర్పరూపంలో తపస్సు చేస్తున్నాడని తన శిష్యులకు తెలిపి, ఆ పుట్టకు నమస్కరించి, పడగ వంటి ఒక శివలింగాన్ని ఆ పుట్టమీద ప్రతిష్టించి, పూజించి ముందుకు సాగిపోయాడు.
కాలక్రమంలో పుట్టలతో నిండిన ఆ ప్రాంతం నుంచి కుమ్మరి కులం వారు మట్టిని సేకరించి కుండలు చేసి బతికేవారు. వారిలో ఒకడైన వీరారపు పర్వతాలు అనే భక్తుడికి సుబ్రహ్మణ్యుడు కలలో కనిపించి, తాను లింగరూపంలో ఫలానా చోట ఉన్నాననీ, ఆ లింగాన్ని తీసి ప్రతిష్టించాలని ఆదేశించాడు. స్వామి మాట ప్రకారం.. ఆ భక్తుడు నేటి గర్భాలయంలో లింగాన్ని ప్రతిష్టించారు. స్వామి మీద భక్తితో ఆ భక్తుడు అనేక మట్టిబొమ్మలను తయారుచేసి, కాల్చి స్వామిముందు పెట్టి ఆనందించేవాడట. అలాంటి బొమ్మల్లో.. చాలావరకు ధ్వంసంమైపోగా, నేటికీ.. నాడు ఆ భక్తుడు తయారుచేసిన నంది,గుర్రము బొమ్మలు నేటకీ భద్రంగా ఈ ఆలయంలో కనిపిస్తాయి.
పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు. స్వామివారి ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. పానవట్టం క్రింద అందరికీ కనబడే విధం గా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలోని పుట్టనుండి గర్భగుడిలోకి ఉన్న దారి గుండా సుబ్రహ్మణ్యుడు సర్పం అవతారంలో గర్భాలయంలో ప్రవేశిస్తాడని భక్తుల నమ్మకం.
స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర మ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు. సంతానం లేని వారు ఇక్కడి పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన చేస్తే తప్పక సంతానయోగం కలుగుతుందని భక్తుల విశ్వాసం.